నా కులం..మతం ఇవే..: కుట్రలు..కుతంత్రాలు చేసినా నిలబడతా : ఆరోగ్యశ్రీలో సంస్కరణలు..సీఎం జగన్..!
ఏపీలో ప్రతిపక్షాలు పదే పదే తన కులం..మతం పేరుతో రకరకాల ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. తన మతం మానవత్వం..తన కులం మాట నిలబెట్టుకొనే కులం అంటూ జగన్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని తట్టుకోలేక నిత్యం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అనారోగ్యం కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకూడదని.. ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిని నాడు నేడు కార్యక్రమంలో తీర్చి దిద్దుతామని ప్రకటించారు.
అదే విధంగా ఆరోగ్య విభాగంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను మే నాటికి భర్తీ చేస్తామని స్పష్టం చేసారు. జనవరి నుండి కేన్సర్ రోగుకు అన్ని రకాల చికిత్సకు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. జనవరి 1 నుండి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తామని.. వెయ్యి రూపాయాలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తారని..వీరి కోసం పొరుగు రాష్ట్రాల్లోని 130 ఆస్పత్రుల్లోనూ సేవలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజల అలవాట్లు..సమాజం మారితేనే ఆరోగ్యం. అందుకే దశల వారీ మద్యపాన నిషేధం అని చెప్పుకొచ్చారు.
నా కులం..మతం గురించి మాట్లాడుతున్నారు..
ముఖ్యమంత్రి జగన్ గుంటూరు లో వైయస్సార్ ఆరోగ్య ఆసరా ప్రారంభోత్సవంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తన పైన వ్యతిరేకతతో కొందురు రాజకీయంగా ఎదుర్కోలేక..మంచిని చూసి జీర్ణించుకోలేక కొందరు తన మతం..కులం గురించి ప్రస్తావిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేసారు. వారికి సమాధానంగా తన మతం మానవత్వం అని..తన కులం మాట నిలబెట్టుకొనే కులం అని స్పష్టం చేసారు.
తన మీద ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా..కుతంత్రాలు పన్నినా ధైర్యంగా నిలబడతానని..తాను చేయానుకున్న మంచి కోసం ప్రజల మద్దతుతో పోరాడుతానని జగన్ స్పష్టం చేసారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల లు..ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో అధునీకరణంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. తన వద్ద మంత్రదండం లేదని ..అయినా ప్రజలను ..దేవుడిని నమ్ముకొని మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నానని సీఎం చెప్పుకొచ్చారు.
మే నాటికి ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ..
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో వైయస్సార్ ఆరోగ్య ఆసరా పధకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఆయన సోమవారం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారని వివరించారు.
దీనివల్ల ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఓ అంచనాగా చెప్పారు. అదే విధంగా.. వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు..నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని..వీటిని మే నాటికి భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు పూర్తిగా మారుస్తామన్నారు. అపోలో ఆస్పత్రుల తరహాలో వీటిని తీర్చి దిద్దుతా మని స్పష్టం చేసారు. జనవరి నుండి అన్ని రకాల క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స అందిస్తామని..కీమో థెరపీకి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ప్రజల్లోనూ..సమాజంలోనూ మార్పురావటం ద్వారా వైద్యం పైన ఖర్చు తగ్గుతుందని సూచించారు.
జనవరి నుండి ఆరోగ్య శ్రీ కార్డులు
రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే నెల నుండి 510 రకాల మందులు ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నారు. జనవరి 1 నుండి ఆరోగ్య శ్రీ పధకం ద్వారా రెండు వేల రకాల చికిత్సను ప్రారంభిస్తామని..తొలుత పశ్చిమ గోదావరి జిల్లా లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.
మిగిలిన 12 జిల్లాల్లో 12 వందల రకాల చికిత్సలు ఆరోగ్య శ్రీ పరధి లోకి తీసుకొస్తామన్నారు. అన్ని రకాల ఆస్పత్రుల్లో పని చేసే పారిశుద్ద కార్మికుల వేతనాల పెంపు విషయాన్ని వివరించారు. రానున్న మార్చి నెల నాటికి రాష్ట్రంలో కొత్తగా 1060 కొత్త 104, 108 అంబులెన్స్ లు అందుబాటులోకి వస్తున్నాయని సీఎం వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాధ్..బెంగుళూరు..చెన్నై నగరాల్లోని 150కి పైగా ఆస్పత్రుల్లో అర్హులైన వారికి సేవలు అందుతున్నాయన్నారు. సేవలు సరిగ్గా లేకున్నా.. సదుపాయాలు లేకున్నా ఆ ఆస్పత్రులను ఎంప్యానల్ నుండి తొలిగిస్తామన్నారు. ఆరోగ్యం కోసమే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.