వ్యక్తిగత హాజరు నుండి మినహాయించండి: సహ నిందితుడు హాజరవుతారు: కోర్టులో సీఎం జగన్ అభ్యర్దన..!
Recommended Video
కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఏడాది విరామం తరువాత ఆయన కోర్టు ముందుకొచ్చారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులో మొత్తం 11 ఛార్జ్ షీట్లతో పాటుగా ఈడీ దాఖలు చేసిన ఆరు షీట్ల పైన విచారణ జరిగింది. వీటన్నింటినీ కలిపి విచారణ చేయాలంటూ ఇప్పటికే జగన్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. అదే సమయంలో తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరగా సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి నిరాకరించింది.
దీంతో..ఈ రోజు ఈడీ కోర్టు ముందు జగన్ మరో సారి తన అభ్యర్దన కోర్టు ముందుంచారు. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన తరపున సహ నిందితుడు హాజరు అవుతారని కోర్టుకు నివేదించారు. ఈ రోజు విచారణ ముగించిన కోర్టు ఈ కేసును వచ్చే వారం అంటే జనవరి 17కు వాయిదా వేసింది. ఆ తరువాత జగన్ కోర్టు నుండి వెళ్లిపోయారు.
హాజరు మినహాయింపు ఇవ్వండి..
ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఏపీ సీఎం జగన్ మినహాయింపు కోరుతున్నారు. గతంలో కూడా జగన్ ఇదే విధంగా కోరగా... ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అప్పుడు తన తరపున న్యాయవాది హాజరతారని కోరిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు తన తరపున సహ నిందితుడు హాజరు అవుతారని, తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయవాది కోరుతున్నారు.
ఇక, ఈ రోజు జరిగిన విచారణకు జగన్ తో పాటుగా విజయ సాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన, అధికారులు శ్రీలక్ష్మి, రిటైర్డ్ ఐఏయస్ శామ్యూల్ హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లతో పాటుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల పైన ఈ రోజు విచారణ సాగినట్లు సమాచారం. జగన్ తరపున న్యాయవాదుల తమ వాదన వినిపించిన తరువాత కేసును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసారు. ఆ తరువాత కోర్టు నుండి నేరుగా జగన్ బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుండి అమరావతి చేరుకోనున్నారు.