పొరుగు రాష్ట్రాల్లోలా ఏపీలో భారీ వసతులున్న ఆస్పత్రులు లేవు: కేంద్ర సహాయం కావాలన్న సీఎం జగన్
కరోనావైరస్ కట్టడి నేపధ్యంలో రాష్ట్రాల కేసులు పెరుగుతున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ -19 మహమ్మారి పంజా విసురుతున్న నేపధ్యంలో వివిధ రాష్ట్రాలలో పరిస్థితిపై చర్చించడానికి పిఎం మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోడీకి ఈ తమ అభ్యర్ధనలు వినిపించారు.
ఏపీలో కరోనా పరిస్థితి ప్రధానికి వివరించిన సీఎం జగన్ .. సహాయం కోసం విజ్ఞప్తి
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం చేపట్టిన అన్ని చర్యలను ప్రధాని మోడీకి వివరించారు. నేడు వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జగన్ జగన్ మాట్లాడుతూ ఏపీలో వైద్య సదుపాయాలూ మెరుగుపరచడానికి కేంద్ర సహాయ సహకారాలు కావాలని విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఏపీలో మహా నగరాలు లేవని, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవని ఈ సందర్భంగా జగన్ ప్రధాని మోడీకి తెలిపారు. రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం సహాయం అందించాలని ఆయన కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో స్వావలంబన సాధించామన్న జగన్
ప్రధాని మోడీ తో సమీక్ష సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి , కరోనా పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వావలంబన సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని తెలిపిన జగన్ ప్రతి పది లక్షల మందికి నలభై 7489 పరీక్షలు నిర్వహించినట్లుగా మోడీ దృష్టికి తీసుకెళ్లారు. పాజిటివ్ కేసులు గుర్తించడంలో ఏపీ ప్రభుత్వం వేగంగా పని చేస్తుందని, మరణాలను అదుపు చేయడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పాడు.
కరోనా నేపధ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య వనరుల పరిస్థితి మోడీకి వివరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వచ్చేనాటికి వైరాలజీ ల్యాబ్ కూడా లేదని, కానీ ఇప్పుడు ప్రతి పది లక్షల మందికి 47 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని జగన్ వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది వాలంటీర్లు కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నామని, ప్రతిరోజు ఏపీలో తొమ్మిది వేల నుండి పదివేల వరకు కేసు నమోదు అవుతున్నాయని చెప్పడంతో పాటుగా 138 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ ఆస్పత్రులు గా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
వైద్య సదుపాయాల కల్పనకు సహకరించాలని వినతి
వైరస్ రాకముందు 108 అంబులెన్స్ వాహనాలు 443 ఉంటే, కరోనా రావడంతో మరో 768 అంబులెన్సులను సమకూర్చుకున్నామని పేర్కొన్నారు . మొత్తం ఏపీలో ప్రస్తుతం 1088 వాహనాలు సమకూర్చుకున్నా మని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్రం మరింత సహాయం చేయాలని, వైద్య సదుపాయాల కల్పన కోసం ఏపీకి కేంద్ర సహకారం అందించాలని ఆయన కోరారు.