ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి: సీబీఐ కోర్టులో జగన్..సాయిరెడ్డి: వ్యక్తిగత ఖర్చుతో వెళ్లాలంటూ..!
ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ తన మీద నమోదైన సీబీఐ కేసుల విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు. అమరావతి నుండి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న జగన్ నేరుగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు వెళ్లారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చివరి సారిగా మార్చిలో ఇదే కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారం.. ఎన్నికల్లో గెలవటం..ముఖ్యమంత్రి కావటం తో ప్రతీ వారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా..ప్రత్యకంగా పిటీషన్లు దాఖలు చేసి అనుమతి పొందుతున్నారు.
అయితే, గత వారం ఇదే అంశం మీద సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ రోజు జరిగే విచారణకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించారు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరయ్యారు. పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి..మాజీ మంత్రి ధర్మాన..కేసుల్లో ఉన్న పలువురు అధికారులు కోర్టుకు చేరుకున్నారు. దీని పైన ఇప్పటికే టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి తన సొంత ఖర్చులతో కోర్టుకు హాజరు కావాలని డిమాండ్ చేస్తోంది.
విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు: మారుతున్న పరిణామాలతో: ప్రభుత్వం నిర్ణయం..!
నేరుగా సీబీఐ కోర్టుకు సీఎం
ముఖ్యమంత్రి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి అయిన తరువాత మీద ఉన్న పాలనా పరమైన బాధ్యతల కారణంగా తాను ప్రతీ వారం కోర్టుకు హాజరు కాలేనని..తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని..కోర్టు నిర్దేశించిన సమయంలో తప్పని సరిగా తాను హాజరవుతానంటూ కోర్టులో జగన్ తరపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన సీబీఐ అభ్యతరం వ్యక్తం చేసింది.
కోర్టు జగన్ అభ్యర్ధనను
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ కు మినహాయింపు ఇస్తే..సాక్ష్యులపైన ప్రభావం పడుతుందని వాదించింది. దీంతో..కోర్టు జగన్ అభ్యర్ధనను తోసి పుచ్చింది. అప్పటి నుండి ప్రతీ వారం జగన్ తరపు న్యాయవాది సీఎం గైర్హాజరకు సంబంధించి పిటీషన్ దాఖలు చేసి మినహాయింపు పొందుతున్నారు. కానీ, ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఈ వారం జగన్ తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే, ఇదే అంశం మీద ఆయన మరోసారి హైకోర్టులో అప్పీల్ కు వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
విచారణ కోసం సాయిరెడ్డితో సహా..
సీబీఐ కేసుల్లో విచారణ కోసం జగన్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. జగన్..విజయ సాయిరెడ్డి ఇద్దరూ తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుతో పాటుగా అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు సైతం కోర్టు ముందుకు వచ్చారు. కోర్టులో వాదనలు జరిగిన తరువాత సీఎం జగన్ నేరుగా బేగంపేట విమా నాశ్రయంకు వెళ్లి అక్కడి నుండి అమరావతికి తిరిగి వెళ్తారు.
ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం
ఆయన ఈ నెల 13న తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీకి సంబంధించి రెండు ప్రభుత్వాలు అధికారికం గా సమాచారం ఇవ్వలేదు. అయితే, జగన్ ఆ రోజు హైదరాబాద్ లోనే ఉంటారని తెలుస్తోంది. ఇక, టీడీపీ జగన్ సీఎం హోదాలో కాకుండా వ్యక్తిగత ఖర్చులతో కోర్టుకు హాజరు కావాలని డిమాండ్ చేస్తోంది.