సీఎం జగన్ ఫైనల్ వార్నింగ్ - సర్వే నివేదికలు వెల్లడి..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వారిని ముందుగానే ప్రజల్లోకి పంపి..ఎన్నికల సమయానాకి పూర్తిగా సానుకూల వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, కొందరు ఎమ్మెల్యేల తీరు పైన ముఖ్యమంత్రి ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు. వారికి ఇప్పటికే హెచ్చరికలు చేస్తూ..సమయం ఇచ్చిన సీఎం ఇక కఠినంగా వ్యవహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్
నేడు గడపగపడకు ప్రభుత్వం వర్క్ షాప్ లో సీఎం జగన్ కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ కు అధికారులను ఆహ్వానించారు. అధికారులు - ఎమ్మెల్యేల సమక్షంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరు.. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. అధికారిక సమీక్ష తరువాత సీఎం జగన్ పార్టీ నేతలతో సమావేశం కొనసాగించనున్నారు. ఆ సమయంలో ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఎమ్మెల్యేలకు ప్రజాభిప్రాయం ఏంటనేది వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి నిర్దేశించిన సమయంలోగా ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోకుంటే..వేరే వాళ్లకు అవకాశం ఇవ్వక తప్పదని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు.
ఇదే ఫైనల్ వార్నింగ్ ..ఇక నో ఛాన్స్
ఇద్దరు ఎమ్మెల్యేలు అయిదు రోజుల కంటే తక్కువగా గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనట్లుగా సీఎం కు సమాచారం అందింది. అదే విధంగా మాజీ మంత్రులుగా వ్యవహరించిన వారిలో కొందరు ఈ కార్యక్రమ నిర్వహణలో నిర్లిప్తంగా ఉండటం పైనా సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి..ఎమ్మెల్యేల పని తీరు..ప్రభుత్వం పైన ప్రజాభిప్రాయం వంటి అంశాల పైన సీఎం జగన్ మూడు సంస్థల సర్వేలు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో ప్రభుత్వ పాలన - సీఎం జగన్ పథకాల పైన అంచనాలకు తగినట్లుగానే సానుకూల స్పందన ఉందని, ఎమ్మెల్యేల తీరు పైన వస్తున్న ఫీడ్ బ్యాక్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని తెలుస్తోంది. దీంతో, సీఎం జగన్ ఎవరైతే ప్రజామోదంలో వెనుకబడి ఉన్నారో వారికి ఇదే లాస్ట్ ఛాన్స్ గా హెచ్చిరకలు చేయటానికి సిద్దమయ్యారు.
నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకులు
ఇక, ఎన్నికల మూడ్ రాష్ట్రంలో మొదలైన వేళ, ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీ బలహీనంగా ఉండటానికి వీళ్లేదని సీఎం స్పష్టంగా చెబుతున్నారు. ఏ ఒక్కరి కోసం ఏ ఒక్క నియోజకవర్గం వదులుకోవటానికి సిద్దంగా లేనని సీఎం స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలోనే భాగంగానే ముఖ్యమంత్రి జగన్ నేటి సమావేశంలో మరింత క్లియర్ గా తుది హెచ్చరిక చేసేందుకు సిద్దమయ్యారని పార్టీ నేతల సమాచారం. దీంతో పాటుగా మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిశీలకులకు సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వారి జాబితాను సీఎం జగన్ అధికారికంగా ప్రకటించనున్నారని చెబుతున్నారు. దీంతో..నేటి సమావేశం వచ్చే ఎన్నికల సంసిద్దతలో భాగంగా కీలక భేటీ కానుంది. ముఖ్యమంత్రి వెల్లడించే అంశాల పైన ఉత్కంఠ నెలకొని ఉంది.