ఏది నిజం: జగన్ తప్పులో కాలేసారా..చంద్రబాబు చెప్పిందే వాస్తవమా : ఎవరు రాజీనామా చేయాలి..!
అసెంబ్లీని దద్దరిల్లేలా చేసిన సున్నా వడ్డీ పధకంలో ఎవరి వాదన నిజం. ముఖ్యమంత్రి జగన్ చేసిన సవాల్. ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ తరువాత ఇచ్చిన సమాధానం లో ఏది వాస్తవం. సున్నా వడ్డీ పధకం చంద్రబాబు హయాం లో అమలు చేయలేదని నిరూపిస్తానని..అలా నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ సవాల్ చేసారు. దీనికి సభ వాయిదా పడిన తరువాత చంద్రబాబు తన హాయంలో ఇదే పధకం కింద చేసిన కేటాయింపులను వివరిం చారు. మరి..ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి. జగన్ తప్పులో కాలేసారా. చంద్రబాబు ఆత్మరక్షణలో పడుతారా. ఏం జరగబోతోంది.
సున్నా వడ్డీ పధకం పై సవాళ్లు..
శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ కరువు పైన స్టేట్మెంట్ చేసారు. అందులో భాగంగా తాను అమలు చేయనున్న సున్నా వడ్డీ పధకం పైన ప్రకటన చేసారు. టీడీపీ సభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ ఈ పధకం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారని..చంద్రబాబు హాయంలో కొనసాగిందని చెప్పారు. దీనికి సీఎం అభ్యంతరం వ్యక్తం చేసారు. సున్నా వడ్డీ పధకం చంద్రబాబు హాయంలో అమలు చేయలేదని..తాను రికార్డులు చూపి స్తానని చెప్పారు. చంద్రబాబు సున్నా వడ్డీ పధకం అమలు చేయలేదని నిరూపిస్తే ఆయన రాజీనామా చేస్తారా అంటూ ముఖ్యమంత్రి సవాల్ చేసారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు జగన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు సైతం రికార్డులు ప్రభుత్వం వద్దనే ఉంటాయని ..మీరే తేల్చాలని సూచించారు. ఆ సమయంలో చంద్రబాబు ఆవేశంతో ఊగి పోయారు. ఆ తరువాత జగన్ సున్నావడ్డీ పదకం గురించి వివరిస్తూ దాదాపు 15 వేల కోట్లు చెల్లిస్తున్నామని..ఇది గత ప్రభుత్వం అమలు చేసామంటున్న రైతు రుణ మాఫీతో సమానమని వివరించారు.
మేం అమలు చేసాం..ఇవీ లెక్కలు: చంద్రబాబు
శాసనసభలో సున్నా వడ్డీ పైన చర్చ సాగుతుండగానే సభ వాయిదా పడింది. ఆ తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియా సమావేశంలో సున్నా వడ్డీ పధకం తమ హయాంలో అమలు చేసామని స్పష్టం చేసారు. 2013లో అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకాన్ని 2014 నుంచి 2019 వరకూ తమ ప్రభుత్వం కొనసాగించిందని తేల్చిచెప్పారు. ఇందుకు ఆధారాలు కూడా విడుదల చేశారు. ఇప్పుడు జగన్ రాజీనామా చేస్తారా అని ప్రతిసవాల్ విసిరారు. 2014-15 బడ్జెట్ లో లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు పూర్తిస్థాయిలో వడ్డీ రాయితీ, లక్ష నుంచి రూ.3 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు పావలా వడ్డీ కొరకు రూ.230 కోట్లు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. 2016-17 బడ్జె ట్ లో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాల కోసం రూ.177 కోట్లు ప్రతిపాదించామని. 2017-18 బడ్జెట్ లో లక్ష రూపా యల వరకు పంట రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.172 కోట్ల ప్రతిపాదనలు పెట్టాం అంటూనే.. 2018-19 బడ్జెట్ లో కూడా లక్ష రూపాయల వరకు పంట రుణాలను సక్రమంగా చెల్లించిన రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.172 కోట్లు ప్రతిపాదనలు చేసామని స్పష్టత ఇచ్చారు.
ఎవరి వాదన నిజం..ప్రభుత్వం చెబుతుందేంటంటే..
చంద్రబాబు హయాంలో సున్నావడ్డీ పధకం అమలు చేయలేదని ముఖ్యమంత్రి జగన్ సవాల్ చేస్తుంటే..తాము అమ లు చేసాం..ఇవీ లెక్కలు..మరి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చంద్రబా బు చెప్పిన లెక్కలే నిజమైతే ముఖ్యమంత్రి తప్పులో కాలేసారా అనే అనుమానం వైసీపీ ఎమ్మెల్యేల్లోనే వ్యక్తం అవు తోంది. ఇదే సమయంలో ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఒక విశ్లేషణ చేస్తున్నారు. చంద్రబాబు హాయంలో ప్రతీ ఏటా బడ్జెట్లో సున్నా వడ్డీ కింద కేటాయింపుల్లో రూ. 172 కోట్లు అని కనిపిస్తాయి. కానీ, ఖర్చుమాత్రం సున్నా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆ మొత్తం కూడా సున్నా వడ్డీ కాకుండా..పావలా వడ్డీ కింద కేటాయింపులుగా చూపిం చారని వివరణ ఇస్తున్నారు. మరి..ఇప్పుడు ఈ అంశంలో ముఖ్యమంత్రి తీరు పైన టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. మరి..ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.