రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు .. విద్యుత్ నగదు బదిలీపై సీఎం జగన్ క్లారిటీ
విద్యుత్ నగదు బదిలీపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. నేడు జరిగిన క్యాబినెట్ భేటీలో ఉచిత విద్యుత్ పథకం - నగదు బదిలీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రైతులకు అందించే విద్యుత్ పై మాట్లాడిన సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు అని హామీ ఇచ్చారు. రైతుకు అందించే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించేది లేదని ఆయన స్పష్టం చేశారు . అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తున్నామని, కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుందని పేర్కొన్నారు.
రైతులకు విద్యుత్ నగదు బదిలీకి ఆమోదం తెలిపిన ఏపీ క్యాబినెట్ .. భగ్గుమంటున్నటీడీపీ నేతలు
రైతులకు నేరుగా కరెంట్ బిల్లులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని, ఆ తర్వాత వారు డిస్కంలకు డబ్బులు చెల్లించవచ్చు అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో రైతులపై ఎలాంటి భారం పడదని, రైతులు వారి సొంత డబ్బు ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం ఉండదని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్న జగన్, చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇవ్వడం అంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడం అని ఎద్దేవా చేశారు.
ఉచిత విద్యుత్ విషయంలో విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది అంటూ మండిపడ్డారు. సుమారు 8 వేల కోట్ల మేర ఉచిత విద్యుత్ బకాయిలు పెట్టారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పై పేటెంట్ ఒక్క వైయస్సార్ కి ఉందని, అందుకే ఆ పథకానికి ఆయన పేరు పెట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అవలంబించబోతున్న విద్యుత్ విధానానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జగన్ స్పష్టం చేశారు.
Recommended Video
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బకాయిలు తీర్చామని, 1700 కోట్ల రూపాయలతో ఫీడర్ లను అప్ గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, మున్ముందు కూడా ఇస్తామని పేర్కొన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.