కొత్తగా మంత్రులయ్యే వారికి జగన్ ట్విస్ట్: వారితో చెప్పబోయేది ఇదే : ఆశావాహులకు రిలీఫ్..!
కొత్త ప్రభుత్వం. కొత్త కేబినెట్. కొత్తగా మంత్రులయ్యేది ఎవరో తేలిపోనుంది. ఉత్కంఠగా తమకు పదవులు వస్తాయో రావో అనీ నిరీక్షణ. సరే..మంత్రులుగా ఖరారైనా వారి సమర్ధతకు పరీక్ష. కొత్తగా మంత్రులయ్యే వారికి జగన్ కొత్త ట్విస్ట్. దీంతో.. పదవులు రాలేదనే ఆవేదన ఉండే వారికి రిలీఫ్. ముఖ్యమంత్రి జగన్ వైసీపీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ వేదిక ద్వారా మంత్రి పదవులపైన స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో..జగన్ చేయబోతున్న దిశా నిర్ధేశం కీలకంగా మారింది. ఇంతకీ జగన్ ఏం చెప్పబోతున్నారు..
ఏకపక్షం కాదు...అందరి ఆమోదంతోనే..
జగన్ తన కేబినెట్ ఎలా ఉండబోతుందో తన పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు. కేబినెట్ కూర్పు గురించి ఏకంగా శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి..ముందుగానే తన టీం గురించి అందరు ఎమ్మెల్యేలకు చెప్పటం వారి ఆమోదంతోనే మంత్రి పదవులు కట్టబెట్టటం అరుదైన విషయంగా చెబుతున్నారు. దీని ద్వారా తాను ఏకపక్షంగా కాదు..పార్టీలోని అందరి ఆమోదంతోనే కేబినెట్కు రూప కల్పన చేసానని..దీని ద్వారా ఎటువంటి అసంతృప్తులు లేకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రాంతీయ - సామాజిక సమతుల్యత పాటిస్తూ ఏ కోణంలో మంత్రులను ఎంపిక చేసిందీ.. ఏ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందీ జగన్ వివిరించనున్నారు. మంత్రివర్గం లో ఎవరనేది ప్రకటించిన తరువాత వారి ఎంపికకు వైసీపీ శాసనసభా పక్ష ఏకగ్రీవ తీర్మానం ద్వారా జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించనుంది.
అయినా..వారికి మాత్రం జలక్..
ఎవరైతే మంత్రి పదవులు దక్కించుకుంటున్నారో..వారి సమర్ధతకు జగన్ పరీక్ష పెట్టనున్నారు. వారి మీద నమ్మకంతో మంత్రి పదవి ఇస్తున్నానని చెబుతూనే...వారికి నిర్దేశిత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. అదే విషయాన్ని జగన్ ఈ శాసనసభ పక్ష సమావేశం ద్వారా స్పష్టం చేయనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గం రెండేళ్ల వరకు మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని జగన్ తేల్చి చెప్పనున్నారు. సమర్ధవంతంగా ప్రభుత్వంలో..పార్టీ వ్యవహారాల్లో ఎవరైతే వ్యవహరిస్తారో వారికి తిరిగి అవకాశం ఉంటుందని చెప్పటం ద్వారా వారిలో పోటీ తత్వం పెంచేందుకు కొత్త వ్యూహం తెర మీదకు తెస్తున్నారు. రెండేళ్ల తరువాత ఇప్పుడు అవకాశం రాని వారికి ఛాన్స్ దక్కుతుందని..ఈ లోగా పార్టీ బలోపేతం కోసం ఎవరైతే సమర్దవంతంగా పని చేస్తారో వారికే అవకాశం అనే విషయం తేల్చి చెప్పనున్నారు. తాను ఎంత ఉదారంగా వ్యవహరిస్తానో..ఇప్పుడు పార్టీ అధినేతగా..ప్రభుత్వ రధసారధిగా అంతే కఠినంగా ఉంటానని జగన్ చెప్పనున్నారు.
ఆశావాహులకు రిలీఫ్...
ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న వ్యూహం ద్వారా..ఇప్పుడు ఏర్పాటయ్యే కేబినెట్లో మొత్తంగా 25 మందిని ఒకే సమయంలో భర్తీ చేస్తున్నా..అది రెండేళ్ల వరకు మాత్రమే ఉంటుందని జగన్ స్పష్టం చేయటం ఆశావాహుల్లో కొంత ఊరటనిచ్చే విషయం. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు గెలవటంతో పదవుల పోటీ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో.. ఇటు ప్రభుత్వంలో..అటు పార్టీలో సమర్ధత పెంచేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరి సంవత్సరంలో రాపిడ్ కేబినెట్ ఉంటుందని..ఈ రెండు విడతల్లో పని చేసిన మిసైల్స్ లాంటి మంత్రులతో చివరి సంవత్సరం కేబినెట్ ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తామని జగన్ స్పష్టం చేయనున్నారు. దీంతో..ఇప్పుడు జగన్ తన పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో ఎటువంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.