జగన్ కేబినెట్ ఫైనల్ లిస్ట్: బీసీ -ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత.. చాన్స్ ఎవరెవరికి దక్కిందంటే..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ను ఖరారు చేసారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం తన డ్రీం కేబినెట్కు తుది రూపు ఇచ్చారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ కొత్త కేబినెట్ ఖరారు చేసారు. గవర్నర్ నరసింహన్తో సమావేశం సమయంలో తన కేబినెట్ వివరాలను అందించారు. శనివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయం సమీపంలో కొత్తగా 25 మందితో గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందులో సీనియర్లతో పాటుగా జూనియర్లకు అవకాశం ఇచ్చారు. ఈ కూర్పులో బీసీ-ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చారు. రెడ్డి..కాపు వర్గానికి సమ ప్రాధాన్యత కల్పించారు.
బీసీ-ఎస్సీ వర్గాలకు అధిక ప్రాధాన్యత..
జగన్ తన కేబినెట్లో బీసీ వర్గానికి 7 పదవులు కట్టబెట్టారు. అయిదుగురు ఎస్సీలు..ఒక మైనార్టీకి అవకాశం ఇచ్చారు. ఇక, రెడ్డి వర్గానికి..కాపు వర్గానికి సమ ప్రాతినిధ్యం కల్పిస్తూ నాలుగు పదవులు చొప్పున ఖరారు చేసారు. ఎస్టీ-వైశ్య- క్షత్రియ-కమ్మ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఖరారు చేసారు. జగన్ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పిన విధంగానే ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు ఇచ్చారు. బీసీ వర్గాలకు ఎనిమిది మందికి అవకాశం ఇవ్వటం..ఎస్సీలకు 5మందికి ఛాన్స్ ఇవ్వటం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇక, రెడ్డి వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారని అంచనా వేసినా..కాపు వర్గం తో సమానంగా రెడ్డి-కాపు వర్గాలకు నాలుగు స్థానాలు చొప్పున ఖరారు చేసి కొత్త సమీకరణాలకు తెర తీసారు.
కొత్త మంత్రులు వీరే..
- శ్రీకాకుళం జిల్లా నుండి.. ధర్మాన కృష్ణదాస్.
- విజయనగరం జిల్లా నుండి..బొత్సా సత్యనారాయణ, పుష్ఫ శ్రీవాణి.
- విశాఖ నుండి.. అవంతి శ్రీనివాస్.
- తూర్పు గోదావరి..కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్ర బోస్ , విశ్వరూప్.
- పశ్చిమ గోదావరి..ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు,తానేటి వనిత.
- కృష్ణా నుండి.. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్.
- గుంటూరు నుండి...ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ.
- ప్రకాశం నుండి.. బాలినేని శ్రీనివాస రెడ్డి.
- నెల్లూరు జిల్లా.. మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్.
- కర్నూలు నుండి..బుగ్గన రాజేంద్రనాద్, గుమ్మనూరు జయరాం.
- అనంతపురం-శంకర నారాయణ,
- చిత్తూరు నుండి..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నారాయణ స్వామి.
- కడప- అంజద్ భాషా పేర్లు ఖరారు అయ్యాయి.
ముగ్గురు మహిళలకు అవకాశం..
జగన్ కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం దక్కింది. అందులో ఎస్సీ వర్గం నుండి తానేటి వనిత, మేకతోటి సుచరిత ఉన్నారు. ఎస్టీ వర్గం నుండి పుష్ఫ శ్రీవాణి కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఎస్టీ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని జగన్ ప్రకటించటంతో పుష్పశ్రీ వాణికే ఆ పదవి దక్కే అవకాశం ఉంది. ఇక, మైనార్టీలకు ఇచ్చే ఉప ముఖ్యమంత్రి పదవి కడప ఎమ్మెల్యే అంజద్ భాషాకు దక్కనుంది. అనూహ్యంగా అనంతపురం జిల్లాలో మొత్తం 12 సీట్లు గెలవగా..కేవలం ఒక్కరికే అక్కడ మంత్రిగా అవకాశం కల్పించారు. సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మంత్రి పదవులు ఆశించారు.