హైకోర్టులో అప్పీల్ కు జగన్: సీబీఐ కోర్టు తీర్పుతో నిర్ణయం: టీడీపీ అటాకింగ్ షురూ..!
సీబీఐ కోర్టు నిర్ణయం పైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో.. వెంటనే జగన్ న్యాయవాదులు ఈ తీర్పు పైన హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో.. వారం వారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా రాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్ తన పిటిషన్లో కోరారు.
అయితే, దీనికి సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనేక అంశాలను సీబీఐ తమ వాదనల్లో కోర్టుకు నివేదించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్ పిటీషన్ ను తిరస్కరించింది. ఇప్పుడు జగన్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించటం ద్వారా అక్కడ నుండి అనుమతి పొందేందేకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సీబీఐ కోర్టు తీర్పును స్వాగతించింది. జగన్ కోర్టుకు హాజరయ్యేందుకు ప్రభుత్వ నిధులు వినియోగించటానికి వీళ్లేదనే వాదన మొదలు పెట్టింది.
సీఎం జగన్ కు బిగ్ షాక్ :హాజరు మినహాయింపు తిరస్కరించిన కోర్టు: కొత్త చిక్కుల్లో ముఖ్యమంత్రి..!
హైకోర్టులో జగన్ అప్పీల్..
అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న జగన్...వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు మినహాయింపు ఇవ్వటానికి నిరాకరించింది. ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో.. వారం వారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా రాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్ తన పిటిషన్లో కోరారు.
రూ.60 లక్షలు ఖర్చవుతుందని
సీఎం హోదాలో ఒక్కరోజు ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్కు వస్తే సెక్యూరిటీ, ప్రొటోకాల్ తదితర వాటికి రూ.60 లక్షలు ఖర్చవుతుందని.. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని, దీనివల్ల మరింత భారమని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టుకు హాజరయ్యేందుకు జగన్కు వ్యక్తిగతంగా ఇబ్బంది లేదని, సీఎంగా విధులు నిర్వహించాల్సి ఉందని, ప్రజాప్రయోజనాల రీత్యానే హాజరు మినహాయింపు కోరుతున్నామని నివేదించారు. అయినా..కోర్టు తిరస్కరించటంతో దీని పైన హైకోర్టులో అప్పీల్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆ దిశగా హైకోర్టకు జగన్ తరపు న్యాయవాదులు అవసరమైన చర్యలు ప్రారంభించారు. సీబీఐ మాత్రం సుప్రీం నుండే అనుమతి పొందాల్సి ఉంటుందని చెబుతున్నారు. అప్పటి వరకు ప్రతీ వాయిదాలోనూ మినహాయింపు కోరాల్సి ఉంటుంది.
సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు..
ముఖ్యమంత్రి జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ సమయంలో సీబీఐ వ్యక్తం చేసిన అభ్యంతరాలతో కోర్టు ఏకీభవించింది. సీబీఐ తరపు న్యాయవాది తాము ఎందుకు జగన్ పిటీషన్ ను వ్యతిరేకిస్తుందీ తన వాదనల్లో వివరించారు. అయితే జగన్పై తీవ్ర ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయని.. ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారనే అరెస్టు చేశామని, ఇప్పుడు సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే హాజరు మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ స్పెషల్ పీపీ వాదనలు వినిపించారు.
సీబీఐ కోర్టు కొట్టివేసిందని
అదీగాక.. హాజరు మినహాయింపు కోరుతూ జగన్ గతంలో దాఖలు చేసుకున్న పిటిషన్లను రెండు పర్యాయాలు సీబీఐ కోర్టు కొట్టివేసిందని, దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. సీబీఐ కోర్టు తీర్పును సమర్థిస్తూ జగన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. హోదాను కారణంగా చూపించి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరరాదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు. గతంలో జగన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అయితే, ముందుగా హైకోర్టుకు వెళ్లి..అక్కడ తీర్పు తరువాత మాత్రమే సుప్రీంకు వెళ్లే అవకాశం ఉండటంతో జగన్ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు.
ఎటాకింగ్ మొదలు పెట్టిన టీడీపీ..
సీబీఐ కోర్టు జగన్ పిటీషన్ ను తిరస్కరించటాన్ని టీడీపీ స్వాగతించింది. 11 ఛార్జ్ షీట్లలో ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టు మినహాయింపు ఇవ్వదని టీడీపీ నేత యనమల వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారనే కారణంతో ప్రజా ధనంతో కోర్టుకు వెళ్లే హక్కు జగన్ కు లేదన్నారు. ఆయన మీద నమోదైన కేసులు వ్యక్తిగతమైనవని..వ్యక్తిగత ఖర్చుతోనే హాజరవ్వాలని డిమాండ్ చేసారు.
కోర్టు ముందు అందరూ సమానులే అనే విషయం మరోసారి తేలిందన్నారు. అసలు 11 ఛార్జ్ షీట్లలో ఉన్న వ్యక్తి ఇటువంటి మినహాయింపు ఎలా కోరుతారని ప్రశ్నిస్తున్నారు. ఇక, హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పైన అక్కడ నిర్ణయం ఆధారంగా జగన్ సుప్రీం కు వెళ్లాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఇప్పుడు రాజకీయంగా మాత్రం జగన్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.