సీఎం జగన్ కీలక నిర్ణయం: నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం: కేంద్రంతో చర్చించి..!
రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ఇప్పటి వరకు అవతరణ దినోత్సవం లేదు. 2014 జూన్2 న తెలంగాణ ఏర్పాటు తేదీని ఆ రాష్ట్రం అవతరణ దినోత్సవంగా జరుపుకుంటోంది. అయితే, 2014 ఎన్నికల్లో అధికారంలో కి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిదేళ్ల పాటు నిర్వహించ లేదు. ఆ స్థానంలో రాష్ట్ర విభజన తేదీ అయిన జూన్ 2న ప్రజల్లో విభజన కసి..మరింత స్పూర్తగా మారి రాష్ట్ర డెవలప్ మెంట్ కోసం పట్టుదల పెంచేలా నవ నిర్మాణ దీక్షల పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించేది.
వైసీపీ ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు టీడీపీ ఎమ్మెల్యే :రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
ఎంతో చరిత్ర ఉన్న ఏపీకి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని అనేక మంది ప్రముఖులు..సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయినా..స్పందన లేదు. ఇక, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దీని పైన కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వంతో కసరత్తు చేసింది. కేంద్రం సైతం తాము గతంలోనే సూచనలు చేసామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం ఇచ్చింది. ఫలితంగా అయిదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోతత్సవం లేని ఏపీ ఈ ఏడాది నుండి నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు.
ఒరిజినల్ బ్రాండ్ కోసం..
రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్లు పూర్తయినా..ఇంకా ఏపికి మాత్రం అవతరణ దినోత్సవం లేదు. రాష్ట్ర విభజన అనంతరం గత చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. అయితే, అందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాలేదు. ఆ తేదీ కాకుండా తాము ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకొనే ఆలోచన చేసింది. అయితే, రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉండటంలో దీనిని ఆచరణ రూపంలో అమలు చేయలేదు.
జగన్ సీఎం అయిన తరువాత..
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర అవతరణ దినోత్సవం పైన అధికారులతో చర్చించారు. దీని పైన ప్రజా సంఘాలు సైతం ముఖ్యమంత్రికి లేఖ రాసింది. మరో సారి దీని పైన కేంద్రంతోనూ సంప్రదింపులు జరిపింది. ఆ సమయంలో.. దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు ఆ విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని తెలిపింది. అయితే, ఏపీ బ్రాండ్ ఇమేజ్ కొనసాగాలంటే.. ఆంధ్రప్రదేశ్ పేరుతో కొనసాగుతున్న రాష్ట్రం అదే విధంగా అవతరణ దినోత్సవం సైతం గతంలో విధంగానే కొన సాగించాలని నిర్ణయించారు. అంతిమంగా దీని పైన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
తొలి వేడుకలు ఎక్కడ..
ఇక, రాష్ట్ర విభజన తరువాత ఈ ఏడాది నుండి తిరిగి నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించనున్నారు. అయితే, దీనిని ఎక్కడ నిర్వహించాలనే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.అ ందులో భాగంగా..ఉత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్ ఈ నెల 21న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోనే ఈ వేడుకలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. తొలి వేడుకలకు కర్నూలు వేదికగా నిలిచే అవకాశం ఉంది.