పాలనపై ప్రజాభిప్రాయం కోరదాం: అమ్మఒడి జనవరి 26 కాదు: పదవులు భర్తీ చేయండి..సీఎం జగన్..!
ముఖ్యమంత్రి తన ఆరు నెలల పాలనపైన ప్రజాభిప్రాయం కోరేందుకు సిద్దవుతున్నారు. ఇందు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మంత్రులకు ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. నవరత్నాల్లో కీలక మైన అమ్మ ఒడి పధకాన్ని సైతం తొలుత జనవరి 26న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, దానిని మరింత ముందుగా జనవరి 9నే ప్రారంభించనన్నట్లు జగన్ వెల్లడించారు. సంక్రాతి అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని మంత్రులకు నిర్ధేశించారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని స్పష్టం చేసారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో మంత్రులు జోక్యం చేసుకో వద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఇక, చంద్రబాబు..పవన్ ప్రభుత్వం పైన చేస్తున్న ఆరోపణలను మంత్రులు గట్టిగా తిప్పి కొట్టాలని సీఎం సూచించారు. రాజకీయంగా అవినీతి తగ్గినా..బ్యూరోక్రసీలో ఇంకా తగ్గలేదని..దీని కోసం ఏసీబీని రంగంలోకి దింపుతున్నామని జగన్ మంత్రులకు వివరించారు.
అమ్మఒడి పథకానికి తెల్లరేషన్ కార్డు ముడిపెట్టిన జగన్ సర్కార్...మీ అభిప్రాయం ఏమిటి..?
పాలనపైన ప్రజాభిప్రాయం కోరుదామంటూ...
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి తన కేబినెట్ మంత్రులకు కీలక అంశాలతో దిశా నిర్దేశం చేసారు. తన ఆరు నెలల పాలన పైన ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించారు. అందు కోసం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని స్పస్టం చేసారు. సంక్రాంతి తరువాత ఎన్నికలు ఉంటాయని..ఆ దిశగా మంత్రులు సిద్దం కావాలని సూచించారు. సంక్రాంతి పండుగ అయిన వెంటనే నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ఇక, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పధకాలు అమలు చేస్తోందని.. ప్రతిపక్ష నేతలు అయిదు నెలల ప్రభుత్వం పైన ఉద్దేశ పూర్వకంగానే విమర్శల చేస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వదరల కారణంగా ఇసుక సమస్య ఏర్పడిందని..ఇప్పుడు సమస్య పరిష్కారం అవుతోందని చెప్పిన సీఎం..మంత్రులు చంద్రబాబు..పవన్ చేస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పి కొట్టాలని ఆదేశించారు.
అమ్మఒడి జనవరి 26న కాదు..
స్ధానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి దీనికి తగినట్లుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. జగన్ నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి పధకాన్ని వచ్చే జనవరి 26న ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచనతో దానిని జనవరి 9నే ప్రారంభించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15000 నగదు అందిస్తాం... ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టిన వెంటనే.. రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని మంత్రులకు స్పష్టం చేసారదు. గ్రామ స్థాయిలో సచివాలయం మొదలు..పధకాల చేరివేతలో వాలంటీర్లతో ప్రజలకు దగ్గర కావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని..మంత్రులు చొరవ చూపించాలని సీఎం స్పష్టం చేసారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీలను దాదాపుగా పూర్తి చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని..దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం స్పష్టం చేసారు. అదే సమయంలో.. ప్రతిపక్షాల ఎత్తుగడలను గమనిస్తూ..అవసరమైన వ్యూహాలు సిద్దం చేసుకోవాలని సూచించారు.
నామినేటెడ్ పదవులు భర్తీ చేయండి..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో రాజకీయ జోక్యం ఉండకూడదని సీఎం స్పష్టం చేసారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఇన్ఛార్జ్ మంత్రులకు గతంలో అప్పజెప్పిన బాధ్యతలను తొలగించాలని సీఎం నిర్ణయించారు. పారదర్శకంగా.. అవినీతి రహితంగా ఉండేందుకు ఔట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ బాధ్యతలను కూడా అధికారులకే అప్పజెప్పనున్నట్లు తేల్చి చెప్పారు. పొలిటికల్ గవర్నెనెన్స్ లేకుంటే ఇబ్బందులు వస్తాయని పలువురు మంత్రులు అభిప్రాయ పడగా.. అవినీతి ముద్ర ప్రభుత్వంపై పడకూడదంటే ఈ నిర్ణయాలు తప్పవని సీఎం తేల్చి చెప్పారు. మంత్రులూ ఎమ్మెల్యేలూ స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. ఈ నెలాఖరులోగా ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు వేయాలని మంత్రులను మరోసారి సీఎం ఆదేశించారు. ఇందులో 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు కేటాయించాలని.. ఈ మొత్తంలోనూ 50 శాతం మహిళలు ఉండేలా చూడాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్చార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో నాలుగు రోజులు ఉంటారో.. ఐదు రోజులు ఉంటారో తనకు తెలియదని .. ఈ నెలాఖరులోగా జిల్లాల్లోని ఆలయ కమిటీలను.. మార్కెట్ కమిటీలను భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.