వైయస్ బాటలోనే జగన్ : మరో కీలక నిర్ణయం..ఇద్దరి మధ్య ఇదే తేడా: పాదయాత్రలో అలా చెప్పారుగా..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి తరహాలోనే ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. గతంలో లాగా తానే నిత్యం ప్రజల్లో ఉండటం సాధ్యం కాదు. దీంతో..ఆయనను కలి సేందుకు ప్రజలకు ప్రతీ రోజు గంట సమయం కేటాయించనున్నారు. ఇందు కోసం జూలై 1 నుండి ప్రజా దర్బార్ నిర్వ హణకు సీఎం నిర్ణయించారు. అయితే..ఇక్కడే చిన్న తేడా ఉంది. అదే సమయంలో ప్రతీ సోమవారం అన్ని జిల్లాల్లో స్పందన నిర్వహణకు సీఎం అదేశించారు.
Recommended Video
జూలై 1 నుండి ప్రజాదర్బార్..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి తరహాలోనే ప్రజల సమస్యలు వినేందుకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రిగా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పాలనుకొనే వారి కోసం ప్రతీ రోజు గంట సమయం కేటాయించాలని నిర్ణయించారు. దీని కోసం తన నివాసం వద్దే ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. పాలన పగ్గాలు స్వీకరించి నెల రోజులు పూర్తి కావటంతో ఇక వెంటనే ప్రజలకు ప్రతీ రోజు సమయం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. జూలై 1 నుండి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. రోజూ గంటపాటు ప్రజల సమస్యలను స్వయంగా ఆడిగితెలుసుకుని జగన్ పరిష్కార మార్గం చూపనున్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో బేగంపేట క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించే వారు. ఉదయాన్నే 8 గంటలకు వైయస్ తన కార్యదర్శి రమణారెడ్డి తో కలిసి ప్రజల మధ్యకు వచ్చే వారు. వైయస్కు ఇచ్చిన ప్రతీ దరఖాస్తుకు ఖచ్చితంగా పరిష్కారం చూపి..అర్డీదారులకు సమాచారం ఇచ్చేవారు.
స్పందనకు జగన్ మార్గదర్శకాలు
ముఖ్యమంత్రిగా తాను సామాన్యులకు అందుబాటులో ఉండటంతో పాటుగా ప్రజీ జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాసమస్యల స్వీకరణకు స్పందన కార్యక్రమం నిర్వహణ జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎల్లుండి నుంచే స్పందన కార్యక్రమం ద్వారా వినతులు స్వీకరణకు కలెక్టర్ల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ అర్జీదారుడికి నెంబరుతో రసీదు ఇవ్వాలని.. నిర్ధేశిత సమయంలోగా వారికి తమ అర్జీలకు సంబంధించి సమాచారం అందించాలని సీఎం నిర్ధేశించారు. మండల స్థాయి నుండి జిల్లా కలెక్టర్ వరకూ ప్రతీ ఒక్కరూ సోమవారం ఖచ్చితంగా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. దీని పైన ప్రతీ వారం నివేదికలు సీఎం కార్యాలయానికి పంపాలని సూచించారు.
మరీ..జగన్ నాడు ఏం చెప్పారు..
ప్రజాదర్బార్లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, జగన్ తన పాదయాత్రలో ప్రతీ గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే చెప్పారు. ప్రజలు ఎవరూ తమ దరఖాస్తులు పట్టుకొని ఏ అధికారి వద్దకు..మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 నాటికి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రతీ సోమవారం కొనసాగుతున్న అర్జీలు స్వీకరించే కార్యక్రమానికి గ్రీవెన్స్ పేరు మార్చి స్పందనగా ఖరారు చేసారు. సీఎం స్థాయంలో సామాన్యులకు అవకాశం ఇవ్వటం అవసరమే అయినా.. దీని ద్వారా సచివాలయాల ఏర్పాటు స్పూర్తి దెబ్బ తినే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతీ ఒక్కరు ముఖ్యమంత్రిని కలవటానికే ప్రాధాన్యత ఇవ్వటం సహజం. మరి..దీనిని సీఎం జగన్ ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి.