జగన్ సంచలన నిర్ణయం: ఆ కీలక శాఖలు తన వద్దే: భారమైనా..భరిస్తా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలనలో కీలకమైన మూడు శాఖలను తానే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ సాధారణ పరిపాలన..పార్టీ వ్యవహారాలు.. ఇతర సంబంధాలను చూస్తూ..ఇలా మూడు శాఖలను పర్యవేక్షించటం పైన సలహాదారులు సైతం కష్టతరమని సూచనలు చేసారు. అయినా..ఆ శాఖలు తన వద్ద ఉంటేనే మరింత సమర్దవంతంగా తీర్చి దిద్దగలుగుతామని..ఆ మూడు శాఖలు తానే పర్యవేక్షిస్తానని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, తన నిర్ణయాన్ని పునరాలోచిస్తే మినహా ఆ మూడు శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
సీఎం పర్యవేక్షణలో మూడు శాఖలు..
ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన..శాంతి భద్రతలు..కీలక అంశాలను పర్యవేక్షించాల్సిన జగన్ వీటితో పాటుగా కీలక మైన మూడు శాఖలను తానే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఇప్పటికే వైద్య-ఆరోగ్య శాఖను తానే పర్యవే క్షిస్తానని జగన్ స్పష్టం చేసారు. ఇదే తరహాలో విద్యా శాఖ- ఇరిగేషన్ శాఖలను తానే చూసుకోవాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఏపీలో తన పాలన ద్వారా మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలనే లక్ష్యంతో ఉన్న జగన్ దీనికి తగినట్లుగా ప్రజల మీద..రాష్ట్ర అభివృద్ది పైన నేరుగా ప్రభావం చూపే శాఖలను తన వద్దే ఉంచుకోవాలని..తానే స్వయంగా ఈ మూడు రంగాల్లో అభివృద్దిని పరుగు పెట్టించాలని నిర్ణియించారు. ఏపీలో విద్యా-వైద్యా-ఇరిగేషన్ రంగాలను గత ప్రభుత్వం పూర్తిగా అవినీతి మయం చేసిందని..వాటిని ప్రక్షాళణ చేస్తూనే..ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని నిర్ణయించారు.
విద్యా..వైద్యం ద్వారా..
ఇక, సామాన్య ప్రజల నుండి ప్రతీ ఒక్కరికీ విద్య-వైద్యం అందుబాటులోకి తీసుకురాగలిగితే తాను సగం సక్సెస్ అయినట్లేనని జగన్ భావిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల ఆధిపత్యం తగ్గిస్తూ..ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెంచుతూ..అమ్మొడి పధకం ద్వారా అక్షరాస్యత రేటును పెంచాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు. దీనికి సంబంధించి తొలి సమీక్షలోనే సూచనలు చేసినా...పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించలేదు. ఇక, వైద్య శాఖ పూర్తిగా నిర్వీర్యం చేసారని జగన్ తన సమీక్షలో ఆవేదన వ్యక్తం చేసారు. తన తండ్రి మానస పుత్రిక అయిన ఆరోగ్య శ్రీని మరింత సమర్దవంతంగా అమలు చేసి..యూనిక్ హెల్త్ కార్డు ద్వారా వెయ్యి రూపాయాలు దాటిన ప్రతీ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రతీ చోట 108 అంబులెన్స్లను అందుబాటులోకి తేవటం ద్వారా ప్రజలకు మేలు జరగటంతో పాటుగా తన తండ్రిని గుర్తు చేస్తూ..తన పాలనలో ఇమేజ్ పెంచుకొనేందుకు జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇరిగేషన్ ద్వారా పేరు సాధించాలని..
ఏపీలో గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ద్వారా కాంట్రాక్టర్లకు నిబంధనలను ఉల్లంఘించి పనులు అప్పగించి అవినీతికి పాల్పడిందని జగన్ ఇరిగేషన్ సమీక్షలో పేర్కొన్నారు. దీని కోసం గత ప్రభుత్వ కాంట్రాక్టుల అప్పగింత పైనా ప్రతీ జిల్లాలోనూ కమిటీలు వేయాలని ఆదేశించారు. ప్రతీ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యత అధికారులు..ప్రజా ప్రతినిధులతో కలిపిన కమిటీకి అప్పగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలని సంకల్పించారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు మరింత దగ్గర కావాలనేది జగన్ లక్ష్యం. పాలనా పరంగా..రాజకీయంగా మంచి పేరు సాధించుకోవాలనే తపనతోనే భారమైనా తానే ఈ మూడు శాఖలను తానే నిర్వహించాలని జగన్ నిర్ణయించారు.