ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు : కొత్తగా ఛైర్మన్ల నియామకం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన సమయం నుండి దీని పైన చర్చ సాగుతున్నా.. ఇప్పుడు ఇది కార్య రూపంలోకి వచ్చింది.
ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దు చేయాలని నిర్ణయించారు. కొత్తగా నియమించే ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు ఛైర్మన్లు...వివిధ రంగాల్లో నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. దీనికి సంబంధించి ఒకటి లేదా రెండు రోజల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇప్పటికే నలుగురు ఛైర్మన్లను ఖరారు చేసినట్లు సమాచారం.
కొత్తగా నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు..
వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాంతీయ డెవలప్ మెంట్ బోర్డులు ఏర్పాటు చేసారు. తెలంగాణ తో పాటుగా రాయలసీమ..ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కమిటీను ఏర్పాటు చేసి ఛైర్మన్లను నియమించారు. అయితే, వాటికి తగిన విధంగా నిధులు..విధులు ఖరారు చేయకపోవటంతో అవి ఉద్దేశాలను చేరుకోలేక పోయాయి. అయితే, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.
స్థానిక పరిస్థితులకు ప్రాధాన్యత
మొత్తం 13 జిల్లాల కోసం నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఆయా ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల పరిధిలో గల జిల్లాలన్నీ అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలను రూపొందించడంతో పాటు అమలు తీరు తెన్నులను పర్యవేక్షిస్తుంది. విజయనగరం జిల్లా కేంద్రంగా (శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్టణం) ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన నుండి తిరిగి రాగానే ఈ ప్రతిపాదన మీద చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అధికారులతో ముఖ్యమంత్రి వీటికి సంబంధించి చర్చలు..సూచనలు చేసారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వీటికి సంబంధించి న కార్యాచరణ..ప్రాధాన్యతలను అధికారులు ఖరారు చేసారు.
కేబినెట్ ర్యాంకుతో చైర్మన్ల నియామకం
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు కేబినెట్ స్థాయి ర్యాంకులో మూడేళ్ల కాల వ్యవధికి చైర్మన్ నియామకం ఉంటుంది. నలుగురు ఛైర్మన్ల నియామకానికి సంబంధించిన పేర్లను ముఖ్యమంత్రి ఇప్పటికే ఖరారు చేసినట్లుగా సమాచారం. అందులో ఉత్తరాంధ్ర ప్రాంతీయ బోర్డుకు ధర్మాన ప్రసాదరావు.. కాకినాడ కేంద్రంగా ఏర్పాటయ్యే బోర్డుకు కొత్తపల్లి సుబ్బారాయుడు.. గుంటూరు కేంద్రంగా ఏర్పాటయ్యే బోర్డుకు మోదుగుల వేణుగోపాలరెడ్డి.. కడప కేంద్రంగా ఏర్పాటయ్యే బోర్డుకు అనంత వెంకట్రామిరెడ్డి పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. వీరితో పాటుగా వివిధ రంగాల్లో నిపుణులైన వారికి ఈ బోర్డుల్లో సభ్యులుగా అవకాశం ఇవ్వనున్నారు. వ్యవసాయం ,నీటి నిర్వహణ, ఆర్థిక వృద్ధి - మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి - సంక్షేమ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. అవసరమైన సిబ్బందిని కూడా ఇస్తారు. ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా మండలిని రద్దు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ తో సమీక్ష తరువాత దీని పైన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.