ఢిల్లీకి సీఎం జగన్: వారంలో ప్రధానితో రెండో సారి భేటీ..! అసలు విషయం ఇదేనా..!
ముఖ్యమంత్రి జగన్ మరో సారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీలో ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్ ఆ వెంటనే అమరావతి తిరిగి వెళ్లిపోయారు. దీంతో..ఆ రోజు కలవాలని భావించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు..కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కావాలని భావించారు. ఇక, ఇప్పుడు శుక్రవారం ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు.
ఆయన మరోసారి ప్రధానితో పాటుగా అమిత్ షా అదే విధంగా ఆర్దిక మంత్రితో పాటుగా జల వనరుల శాఖా మంత్రితోనూ సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రి మరోసారి ప్రధానితో భేటీ కోసం అప్పాయింట్ మెంట్ కోరారని..శుక్ర లేదా శని వారాల్లో ఆయన ప్రధానితో అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానితో రాష్ట్ర సమ్యల పైన చర్చించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతున్నా..ఇద్దరి మధ్య ఒన్ టు ఒన్ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీకి మరోసారి సీఎం జగన్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఢిల్లీ రానున్నారు. ఆ రోజు ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలుస్తారని తెలిసింది. అవసరమైతే శనివారం కూడా జగన్ ఢిల్లీలోనే ఉండొచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత పర్యనటలోనే ఆయన అమిత్ షా తో పాటుగా ఆర్దిక మంత్రిని కలవాలని భావించినా సాధ్యపడలేదు. ఈ సారి వారిద్దరితో పాటుగా జల వనరుల శాఖా మంత్రి షెకావత్ ను సైతం కలవాలని నిర్ణయించారు. అయితే..ప్రధానితో వారం క్రితమే భేటీ అయిన ముఖ్యమంత్రి తిరిగి ఆయనతో భేటీ అయ్యే ప్రయత్నాలు చేయటం వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.
గత సమావేశంలో ప్రధానికి ఆధారాలు..
గత వారం ప్రధానితో సమావేశమైన సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలో గతంలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలను ప్రధానికి వివరించారని సమాచారం. పీపీఏల విషయంలో తాను ఎందుకు సమీక్షకు పట్టుబడుతుంది వివరించీ.. అదే సమయంలో కడప జిల్లాలో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా ఉన్న పారిశ్రామిక వేత్తకు పవర్ ప్లాంట్ కు అనుమతి ఇచ్చిన విధానం గురించి ఆధారాలతో వివరించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 800 కోట్లకు పైగా ప్రజాధనం ఆదా అయిన విషయాన్ని ప్రధానికి ముఖ్యమంత్రి లెక్కలతో వివరించారు. ఇక, ఆ సమావేశంలో కొనసాగింపులో భాగంగానే ఆయన మరోసారి ప్రధానితో సమావేశం అవుతున్నారా అనే చర్చ మొదలైంది.
అమిత్ షా.. నిర్మలా తోనూ భేటీ..
ఈ పర్యటనలో ప్రధానంగా బీజేపీ అధినేత అమిత్ షా తో ముఖ్యమంత్రి కీలకంగా భేటీ కానున్నారు. ఏపీలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులతో పాటుగా.. కేంద్రం నుండి రావాల్సిన సాయం గురించి ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఇక, కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్దిక పరిస్థితిని వివరించనున్నారు. రెవిన్యూ లోటు భర్తీని త్వరిత గతిన పూర్తి చేయాలని కోరనున్నారు. మరో కీలకమైన భేటీ కోసం ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ కోరారు. వచ్చే నెల 1వ తేదీ నుండి పోలవరం పనులు ప్రారంభించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో సమావేశమై పోలవరం రివర్స్ టెండరింగ్ తో పాటుగా..భవిష్యత్ ప్రణాళికల పైన చర్చించే అవకాశం ఉంది.