కేంద్ర కేబినెట్ తీర్మానించింది..మీరు హామీ ఇచ్చారు:హోదా ఇవ్వరెందుకు: నీతి అయోగ్లో సీఎం జగన్..!
ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేసారు. నాడు యుపీఏ ప్రభుత్వ చివరి కేబినెట్లో తీర్మానించినా..రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని ప్రకటించినా..మీరు హామీ ఇచ్చినా..అమలు చేయటానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఆర్దిక లెక్కలను వివిరించారు. ఉపాధి లేక యువత పడుతున్న ఇబ్బందులను చెప్పుకొచ్చారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి..ఏపీని ఆదుకోండి అంటూ నీతి అయోగ్ సమావేశంలో జగన్ అభ్యర్దించారు.
ఏపీకీ హోదా అమలు చేయండి..
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిని నీతి అయోగ్ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గా తొలిసారి నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న జగన్ ఏపీలో ఉన్న పరిస్థితులను వివరించారు. విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. 2014లో నాటి యూపీఏ ప్రభుత్వం చివరి కేబినెట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ తీసుకున్న నిర్ణయం కాపీని అందచేసారు.ప్రత్యేక హోదాను రద్దు చేయలేదని చెబుతూ.. ప్లానింగ్ కమిషన్ అబిజిత్ సేన్ లేఖను జతచేశారు. బీజేపీ తన మేజిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిని విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో ఆర్దిక పరిస్థితిని అంకెలతో వివరించారు. విభజన సమయంలో తీసుకున్న అనైతిక నిర్ణయాల కారణంగా ఏపీ భారీగా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. ఆదాయం వచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లటం వలన నష్టపోయాని అంకెలతో సహా విశ్లేషించారు.
2.60 లక్షల కోట్ల అప్పులకు చేరాము..
2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 97 వేల కోట్ల అప్పులు అప్పచెప్పారని..నేటికి అది మొత్తంగా 2.59 లక్షల కోట్లకు చేరిందని జగన్ వివరించారు. వాటి పైన వడ్డీలకు కలిపి ఏడాది రూ.40 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుందని విశ్లేషించారు. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని..వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే ఏపీకి జరగిన నష్టం కొంత మేర భర్తీ చేసుకోగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా వచ్చే మొత్తం పెరుగుతుందని చెబుతూ... దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సా హకాన్ని ఇవ్వటం ద్వారా మేలు జరుగుతుందన్నారు. దీని ద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్క రించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. ప్రత్యేక హోదా ద్వారానే ఏపీకి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు.. పరిశ్రమలు.. సేవా రంగాల అభివృద్ధి జరుగుతుందని జగన్ వివరించారు.
మీరు హామీ ఇచ్చారు..మేనిఫెస్టోలో చేర్చారు
సీఎం జగన్ ఏపీలో గత అయిదేళ్ల పాలనలో జరిగిన నష్టం గురించి వివరించారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని ఆ కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను సభ్యుల ముందు ఉంచారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా హోదా ఇవ్వాలని అడుగుతాయన్న వాదన గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరగడానికి ముందస్తు షరతుగా మాకు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాకి అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పార్లమెంటులో ఉన్నారనే విష యాన్ని గుర్తించాలని కోరారు. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన ఉందనే విషయాన్ని మర్చి పోకూడదని జగన్ అభ్యర్దించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను ..అంటూ సీఎం జగన్ నీతి అయోగ్ సమావేశంలో మోదీని అభ్యర్దించారు.