సీఎం జగన్ రాజీ పడ్డారా : కీలక అంశం ప్రస్తావన లేకుండానే : స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో..!!
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి సారిగా జాతీయ జెండా ఆవిష్కరించారు. తన ప్రభుత్వ విధానాలను..భవిష్యత్ ప్రణాళికలను తన ప్రసంగంలో ఆవిష్కరించారు. అయితే, జగన్ తన ప్రసంగంలో కీలక మైన అంశాన్ని మాత్రం విస్మరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి ముఖ్యమంత్రి అయిన రెండు నెలల వరకు అదే అశం పైన ప్రతీ సందర్భంలోనూ గుర్తు చేస్తూనే ఉన్నారు. సాధించే వరకూ పోరాటం చేస్తామంటూ చెబుతూ వచ్చారు. ఢిల్లీ వెళ్లినా..నీతి అయోగ్ సమావేశం జరిగినా.. ప్రధానితో భేటీ అయినా.. అమిత్ షాతో మంతనాలు జరిపినా తన వాదనలో భాగంగా కీలక అంశం పైన పట్టు బట్టేవారు. కానీ, కొంత కాలంగా ముఖ్యమంత్రి జగన్ ఆ విషయంలో రాజీ పడ్డారా అనే అనుమానం కలుగుతోంది. ఎక్కడా దాని గురించి ప్రస్తావించటం లేదు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఖచ్చితంగా ఏపీ ప్రజల ఆకాంక్ష సాధించే క్రమంలో భాగంగా కీలకంగా మార్గ నిర్ధేశం చేస్తారని భావించారు. అయితే అది జరగలేదు. మరి..అంతటి కీలక అంశంలో జగన్ మడమ తిప్పారా..మాట తప్పారా...
ముఖ్యమంత్రి ప్రసంగంలో ప్రస్తావన లేకుండానే...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత హోదా జగన్ దీక్షలు చేసారు. బంద్ లకు పిలుపు నిచ్చారు. ఆందోళనలు నిర్వహించారు. యువ భేరీలు మోగించారు. నాటి ముఖ్యమంత్రి హోదా వద్దు ప్యాకేజీకి అంగీకారం తెలపటం పైన పెద్ద ఎత్తున కార్నర్ చేసారు. తనకు 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఖచ్చితంగా హోదా తీసుకువస్తానని ప్రచారం చేసారు. ప్రజలు జగన్ ను నమ్మారు. 25 స్థానాలకు గాను 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. ఫలితంగా దేశంలోనే అతి ఎక్కువ మంది లోక్ సభ సభ్యులున్న పార్టీగా వైసీపీ గుర్తింపు దక్కించుకుంది. జగన్ ఎన్నికల్లో గెలిచారు. ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ..అమిత్ షాతో భేటీ అయ్యారు. అక్కడ జరిగిన మీడియా సమావేశంలో తాము హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటామని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి హోదాలో నీతి అయోగ్ సమావేశంలోనూ.. ఆ తరువాత ప్రధాని వద్ద జరిగిన అఖిల పక్ష భేటీలో జగన్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మోదీ మనసు మారేలా ప్రయత్నం చేయమని అమిత్ షా ను అభ్యర్ధించారు. కానీ, కొద్ది రోజులుగా మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సహా..పార్టీ ఎంపీలు ఎక్కడా హోదా నినాదం వినిపించటం లేదు. ఇక, కీలకమైన స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా తన ప్రభుత్వ విధానాలను వివరించారు. కానీ, హోదా గురించి మాత్రం కనీస ప్రస్తావన లేకుండా ముగించేసారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
గవర్నర్ ప్రసంగంలో ఉంది..సీఎం స్పీచ్ లో మాత్రం..
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి శాసనసభా సమావేశాల్లో గవర్నర్ ప్రసగించారు. ఆ ప్రసంగంలో సైతం ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఏపీకి హోదా ఆవశ్యకతను వివరించారు. హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్ధించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం ఏపీకి హోదా కోసం మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, కొద్ది రోజులుగా బీజేపీ నేతలు మాత్రం తమ పాత వాదననే గట్టిగా వినిపిస్తున్నారు. ఇంకా హోదా గురించి జగన్ మాట్లాడటమంటే ప్రజలను మోసం చేయటమే నంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరో టీడీపీ నేతలు మాత్రం తాము హోదా సాధనలో విఫలం అయ్యామని..ఇప్పుడు హోదా సాధించే బాధ్యత జగన్ మీద ఉందంటూ ముఖ్యమంత్రి మీద మరింతగా ఒత్తిడి పెంచుతున్నారు. కొద్ది రోజుల క్రితం విదేశీ రాయబారులతో ముఖ్యమంత్రి సెమినార్ ఏర్పాటు చేసారు. ఆ సమయంలో ఏపీలో పరిశ్రమల కోసం ఏ రకంగా వ్యవహరిస్తుందీ వివరించారు. తాను తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల గురించి చెప్పుకొచ్చారు. అదే వేదిక నుండి కేంద్ర తమకు సహకారం అందిస్తుందని స్పష్టం చేసారు. కానీ, ప్రత్యేక హోదా గురించి మాత్రం ప్రస్తావన చేయలేదు.
ముఖ్యమంత్రి మౌనం వెనుక..
ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా విషయంలో మౌనం వెనుక కారణం ఏంటనే చర్చ మొదలైంది. బీజేపీ నేతల సూచన మేరకే మెత్తబడ్డారా.. లేక ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో కేంద్రం మీద హోదా కోసం ఒత్తిడి తేవటం కంటే..ముందుగా కేంద్రం నుండి ప్రయోజనాలు అందుకోవటం ముఖ్యమని భావిస్తున్నారా అనే చర్చ మొదలైంది. ప్రతీ విషయంలో సందర్భానుసారానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని జగన్ గతంలోనే హోదా పైన చర్చ సమయంలోనే వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే బాటలో మౌనం పాటిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. అయితే, కేంద్రం చేసిన సూచనల మేరకే ముఖ్యమంత్రి హోదా విషయంలో వెనక్కు తగ్గారనేదీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తన్న మాట. అయితే, జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని.. గతంలో జగన్ హోదా కోసం ప్రధానికి ఇచ్చిన వినతి పత్రాన్ని ప్రధాని కార్యాలయం 15వ ఆర్దిక సంఘానికి నివేదించారు. దీంతో..ఇప్పుడు 15వ ఆర్దిక సంఘం చేసే సిఫార్సులు కీలకం కానున్నాయి. అయితే, స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ హోదా గురించి కనీప ప్రస్తావన చేయకపోవటం పైన మాత్రం ఎవరి వాదన వారు చేస్తున్నారు.