నేను శాశ్వతంగా కనుమరుగైపోతానన్నారు : చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం : వరదలపై సీఎం జగన్..!!
ఆకస్మికంగా వచ్చిన వరదలను ప్రభుత్వ అధికారులు సమర్దవంతంగా చర్యలు తీసుకున్నారని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. రాజకీయాల కోసం బురద జల్లుతున్నారన్నారని వ్యాఖ్యానించారు. లీడర్ అనే వాడు డ్రామాలు ఆడకూడదని.. వాస్తవంగా బాధితులకు మేలు జరిగేలా చేయాలని చెప్పుకొచ్చారు. నాలుగు జిల్లాల్లో వరదల ప్రభావం పైన ముఖ్యమంత్రి సభలో ప్రకటన చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ..తనను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని...శాశ్వతంగా కనుమరుగైపోతానని వ్యాఖ్యానించారని చెప్పారు.
లీడర్ అనేవాడు డ్రామాల కోసం కాదు
వైఎస్సార్ సైతం కాలగర్బంలో కలిసిపోయారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వివరించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు సంస్కారానికి నమస్కారం అంటూ జగన్ పేర్కొన్నారు. వరద సహాయక చర్యలు ఆగకూడదనే తాను వెళ్లలేదన్నారు. సీనియర్ అధికారుల సూచనల మేరకే ఆగిపోయానని చెప్పారు. తాను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యమని వివరించారు జిల్లాకొక సీనియర్ అధికారిని పంపామని.. మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నామని చెప్పారు. సహాయక చర్యల తర్వాత ఖచ్చితంగా పర్యటిస్తానని సీఎం వెల్లడించారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్
హుద్హుద్, తీత్లీ తుఫానులను తానే ఆపానంటారు చంద్రబాబు... అప్పట్లో బాధితులకు అరకొర సహాయం కూడా చేయలేకపోయారంటూ సీఎం జగన్ విమర్శించారు. 50 ఏళ్ల చరిత్రలో రాని విధంగా ఫించా నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిందని జగన్ చెప్పారు. అర్ద్రరాత్రి సమయంలో కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందన్నారు. ఒక బస్సు నదిలో చిక్కుకోవటం వలన ప్రాణనష్టం జరిగిందన్నారు. రెండు మూడు గంటల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వివరించారు. ముంపు గ్రామాలకు తాగు నీరు ..ఆహారం అందించామని చెప్పారు.
ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంది
తాను గత శనివారం ఏరియల్ సర్వే చేసానని చెప్పుకొచ్చారు. కడప తన సొంత జిల్లా.. ప్రతి ఒక్కరి పైన మమకారం ఉన్న వ్యక్తిని తాను ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండనని స్పష్టం చేసారు. సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. సీఎం అక్కడకు వెళ్తే ఏమవుతుందో ..ఏర్పాట్లు చేయటంలో బిజీగా అవుతారన్నారు. వరద బాధితుల కార్యక్రమాలు వదిలేసి..పర్యటన మీద ఫోకస్ పెడతారనే కారణంతోనే వెళ్లలేదని చెప్పుకొచ్చారు.
ఎక్కడా వెనుకడుగు లేదు.. పర్యటనకు వెళ్తాను
ఒడిశాలో సైతం ప్రతీ ఏటా వరదలు వస్తాయని.. అయితే, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ఎప్పుడైనా వరద ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపించారా అని ప్రశ్నించారు. వరద సహాయక చర్యలకోసం 84 కోట్లు విడుదల చేసామన్నారు. ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వంద శాతం పునరుద్దరించామని చెప్పారు. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5లక్షలు అందించామన్నారు. నష్టం వివరాలు ఎక్కడా దాచిపెట్టడం లేదు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని సీఎం వెల్లడించారు.