వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ - సీఎం జగన్ తాజా నిర్ణయాలతో : నియోజకవర్గాల్లో ప్రభావం..!!
ఏపీ అధికార పార్టీల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అటు మంత్రివర్గ విస్తరణ..ఇటు పార్టీ ప్రక్షాళనతో పాటుగా కొత్త జిల్లాల అంశం సైతం వీరి టెన్షన్ కు కారణమవుతోంది. కేబినెట్ లో ఛాన్స్ కోసం కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక, ప్రస్తుత మంత్రులు పార్టీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పుడు..కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్ల అంశం ప్రతిపక్ష నేతల కంటే వైసీపీ ప్రజా ప్రతినిధు ల పైనే ఎక్కువగా ప్రభావం చూపుతోంది.
ఇప్పటికే కొత్త జిల్లాలపైన అనేక సూచనలు..మార్పులు - చేర్పుల కోసం అభ్యంతరాలు వచ్చాయి. అందులో వైసీపీ నేతలు ఇచ్చినవీ ఉన్నాయి. తాము నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలకు అవకాశం లేకుండా.. బలపడాలంటే ఈ నిర్ణయాలు కీలకం అవుతాయని వారు చెబుతున్నారు.

అధికార పార్టీ నేతల్లో కొత్త టెన్షన్
దీంతో.. సభా వేదికగా తమ వినతులను వారు మరోసారి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మొత్తం అభ్యంతరాలు - వినతుల పైన సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పూర్తి సమాచారం సేకరించారు. ఈ నెల 29న వీటి పైన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అందులో ఎవరి వినతులను సీఎం ఆమోదిస్తారు..ఏవి తిరస్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కోరిన విధంగా ఎచ్చర్లను శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచేందుకు సీఎం అంగీకరించారు. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. జిల్లా మారుతుందనే విషయం తెలిసిన వెంటనే తమ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం తీవ్రంగా పడిందన్నారు.

సొంత ఎమ్మెల్యే వినతులు పరిష్కరిస్తారా
కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని, రెవెన్యూ డివిజన్ను గతంలో వలె కొనసాగించాలని మహీధర్రెడ్డి డిమాండ్ చేశారు. గిద్దలూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోరారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పుట్టపర్తి జిల్లాలోకి వెలుతోందని, అక్కడ డివిజన్ రద్దవుతున్న నేపథ్యంలో అక్కడున్న డివిజన్ స్థాయి కార్యాలయాలను కళ్యాణదుర్గంకు మార్చాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ కోరుతున్నారు.
ప్రొద్దుటూరులోని కార్యాలయాలను రాయచోటికి తరలించొద్దని, యథాతథంగా కార్యాలయాలను కొనసాగించాలని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమళ్లు శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నరసాపురం జిల్లాకు భీమవరం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే ప్రసాదరాజు డిమాండ్ చేసారు.

రాజకీయంగా నియోజకవర్గాల్లో ప్రభావం
ఇప్పటికే స్థానికంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకొని కలకలం రేపారు. నరసాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రసాదారాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గూడూరు ప్రాంతాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పడబోయే శ్రీబాలాజీ జిల్లాలో కలపనున్నారని, నెల్లూరు కంటే తిరుపతి దూరమన్నారు.
తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ నియోజకవర్గంలోని గోకవరం మండలాన్ని కాకినాడలో కలుపుతున్నారని, రాజమండ్రి జిల్లాలో కలిపితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కోరారు.

సీఎం సమీక్ష.. నిర్ణయాల పై ఉత్కంఠ
మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటుచేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి కోరుతున్నారు. అయితే, వీటితో పాటుగా ఇప్పుడు కుప్పం రెవిన్యూ డివిజన్ గా స్థానికులు కోరటంతో దీని పైన సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇక, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యర్ధిస్తున్న అంశాల్లో ఎన్నింటికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటారనేది ఈ నెల 31న విడుదల చేసే జిల్లాలు - రెవిన్యూ డివిజన్ల తుది ముసాయిదాలో ప్రకటించనున్నారు. దీంతో..ఈ నిర్ణయాలు రాజకీయంగానూ నియోకవర్గాల్లో తమ భవిష్యత్ పైన ప్రభావం చూపుతాయంటూ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దీంతో..సీఎం నిర్ణయాల పైన వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications