కర్నూలులో కరోనా మృత దేహాల అడ్డగింతపై సీఎం జగన్ ఫైర్: ఏపీ డీజీపీకి ఆదేశాలు
కర్నూలు నగరంలో కరోనా మృతదేహాల ఖననం వివాదంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. కార్పొరేషన్ పరిధిలోని మునగాలపాడు సమీపంలోని భగవాన్ బాలసాయిబాబా ఆశ్రమం దగ్గర కరోనాతో మృతి చెందిన రెండు మృతదేహాలను పూడ్చిపెట్టిన నేపధ్యంలో అక్కడ మునగాలపాడు గ్రామస్తులు ఆందోళనకు దిగిన వివాదం తెలిసిందే .
పూడ్చిపెట్టిన శవాలను వెలికితీయాలని అక్కడ నుండి తరలించాలని, ఆ ప్రాంతం బాలసాయిబాబా ట్రస్టుకు చెందినదని శవాలను ఖననం చేయడానికి వీలులేదని అన్నారు స్థానికులు . ఆ మృత దేహాలను వెలికితీయకపోతే, అక్కడ నుండి తీసుకు వెళ్లకపోతే తామే జేసీబీలతో శవాలను వెలికితీసి మరోచోటికి తరలిస్తామని ఆందోళన చేశారు . ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు.
కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకోవడంపై సీరియస్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నియంత్రణా చర్యలపై నిర్వహించిన సమీక్షలో అసలేం జరిగిందో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు . ఇది చాలా దారుణమైన చర్య అని పేర్కొన్న సీఎం జగన్ అలాంటి పరిస్థితి అక్కడ అడ్డుకున్న వారికి కూడా రావచ్చని పేర్కొన్నారు.
కరోనా సోకినవారి కుటుంబాలను అంటరానివారిగా చూడడం సరికాదని హితవు పలికారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ,అంత్యక్రియలను అడ్డుకుంటే వారిపట్ల సీరియస్గా వ్యవహరించాలని ఏపీ డీజీపీని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.
అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదని పేర్కొన్న జగన్ అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు. మనకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో..? అలాగే స్పందించాలని హితవు పలికారు . బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు అడ్డుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు . ఇక కరోనా వస్తే అంతమాత్రాన అంటరాని వారు కాదని , మందులు తీసుకుంటే తగ్గుతుందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పిన సీఎం జగన్ ఈ విషయంలో జనాల్లో అవగాహన రావాలన్నారు . కరోనా నయం అయితేనే కదా.. వాళ్లు డిశ్చార్జ్ అవుతున్నారు? అని ప్రశ్నించిన సీఎం కరోనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇక కరోనా విషయంలో తప్పుడు ప్రచారాలు చేసి గందరగోళం చేస్తే చట్ట పరంగా చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు.