సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020
''అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే విచ్చలవిడిగా అప్పులు చేశాడు.. అవి కూడా చాలక ఇప్పుడు పన్నులు బాదుడు మొదలుపెట్టాడు.. అందరి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోన్న డబ్బును కొందరికి పంచుతున్నాడు.. ఆంధ్రప్రదేశ్ లో కొద్దిపాటి సంక్షేమం తప్ప అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేశాడు.. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారింది..'' అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తోన్న ప్రతిపక్ష, స్వపక్ష నేతల నోళ్లు మూయించేలా సీఎం జగన్ సైలెంట్ గా భారీ స్ట్రోక్ ఇచ్చినట్లయింది. ప్రతిష్టాత్మక 'స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' అధ్యయనంలో ఆర్థికాభివృద్ధి విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా టాప్ ర్యాంకును పొందింది. పూర్తి వివరాలివి..
తిరుపతిలో జగన్కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ
స్టేట్ ఆఫ్ స్టేట్స్ స్టడీ-2020
వివిధ రంగాల్లో అభివృద్ధి అధ్యయనాలకు సంబంధించి బాగా ప్రాచుర్యం పొందిన ‘మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)'తో కలిసి ప్రఖ్యాత ‘ఇండియా టుడే' సంస్థ ఏటా ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' పేరిట రెండేళ్లకు ఒకసారి ర్యాంకులు విడుదల చేస్తోంది. భారత్ సహా ప్రపంచమంతటా ఏడాది కాలంగా కరోనా విలయం కొనసాగుతోన్న నేపథ్యం, చైనా తప్ప అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం, 50కిపైగా దేశాలు దీవాళా తీయడం, దేశంలోని అన్ని రాష్ట్రాలూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో స్టేట్ ఆఫ్ ది స్టేట్స్-2020 అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. కరోనా ప్రతికూలతల నుంచి కోలుకుంటూ వృద్ధిని సాధిస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లో నిలిచింది.
అత్యుత్తమ మెరుగైన రాష్ట్రం ఏపీ
కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమించి 12 రంగాల్లో.. ఆర్థిక, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలు, ఎంటర్ప్రెన్యూర్షిప్, పరిశుభ్రత, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఆయా రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని వివిధ మార్గాల్లో సేకరించిన డేటా ఆధారంగా అధ్యనం చేసి, ‘ఇండియా టుడే-ఎండీఆర్ఏ' తన ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' ర్యాంకులను రూపొందించింది. అత్యుత్తమ మెరుగైన (మోస్ట్ ఇంప్రూవ్డ్) పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది.
సర్వే ఎలా చేశారంటే..
మొత్తం 12 రంగాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు సాధించిన ప్రగతి ఆధారంగా, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషిస్తూ ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' అధ్యయనాన్ని నిర్వహించారు. ఆధారంగా సర్వేను చేపట్టారు. ఆ విభాగాల్లో రాష్ట్రాలను ఉత్తమ ప్రదర్శన (బెస్ట్ పెర్ఫార్మింగ్), అత్యుత్తమ మెరుగైన (మోస్ట్ ఇంప్రూవ్డ్), ఓవరాల్ కేటగిరీలుగా విభజించింది. వాటికి అనుగుణంగా స్కోర్ ఇచ్చింది. ఆయా విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాలను విజేతలుగా పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ వర్గీకరించింది. వీటికి అనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది.
నిలబెట్టుకున్న జగన్.. పడిపోయిన కేసీఆర్
ఆర్థికాభివృద్ది, పర్యాటక రంగాల్లో ఏపీ టాప్ ర్యాంకును పొందగా, మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది. గతేడాదిలాగే అస్సాం ఈసారి కూడా మొదటి స్థానంలో నిలిచింది. నిజానికి ఏపీ కూడా గత ఏడాది రెండో స్థానంలోనే నిలిచింది. అయితే, టీడీపీ హయాం(2018)లో ఎక్కడో ఎనిమిదో స్థానంలో ఉన్న ఏపీ.. జగన్ సీఎం అయిన ఏడాదికే రెండో స్థానానికి చేరింది. 2020 ర్యాంకుల్లోనే ఏపీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఆర్థికాభివృద్ధిలో టాప్ కు చేరింది. ఓవరాల్ (మోస్ట ఇంప్రూవ్డ్) పెద్ద రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణ ఒక ర్యాంకు కిందికి దిగజారింది. 2019లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 10వ స్థానంలో నిలిచింది. అయితే, ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏపీ 7వ ర్యాంకులో(గతేడాది 8వ ర్యాంకు) నిలవగా, తెలంగాణ 9 స్థానంలో (గతేడాది 10వ స్థానం)లో నిలిచింది.
కిమ్ కిరాతకం: కరోనా భయంతో జనాల్ని లేపేశాడు - సీక్రెట్ లాక్డౌన్ -ఉత్తరకొరియాలో కలకలం
Recommended Video
విజేతలుగా నిలిచిన రాష్ట్రాలివే..
‘ఇండియా టుడే-ఎండీఆర్ఏ' విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్-2020' రిపోర్టులో వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన పెద్ద రాష్ట్రాల లిస్టు ఇలా ఉంది. 1)ఆర్థికరంగంలో మోస్ట్ ఇప్రూవ్డ్ గా ఏపీ, బెస్ట్ పెర్ఫామర్ గా గుజరాత్ నిలిచాయి. 2)మౌలిక సదుపాయాల కల్పనలో బెస్ట్ పెర్ఫామర్ పంజాబ్, మోస్ట్ ఇప్రూవ్డ్ జార్ఖండ్. 3)వ్యవసాయంలో బెస్ట్ పంజాబ్, మోస్ట్ మధ్యప్రదేశ్. 4)పర్యాటకంలో బెస్ట్ మహారాస్ట్ర, మోస్ట్ ఆంధ్రప్రదేశ్. 5)శాంతి భద్రతల్లో పంజాబ్ బెస్ట్ పెర్ఫార్మర్ కాగా, పశ్చిమబెంగాల్ మోస్ట్ ఇప్రూవ్డ్ గా ఉంది. 6)విద్యారంగంలో హిమాచల్ బెస్ట్, వెస్ట్ బెంగాల్ మోస్ట్. 7)ఆరోగ్యంలో కేరళ బెస్ట్, ఒడిశా మోస్ట్. 8)పరిశుభ్రతలో హిమాచల్ బెస్ట్, ఒడిశా మోస్ట్. 9)పరిపాలనలో రాజస్థాన్ బెస్ట్ పెర్ఫార్మర్ గా, అస్సాం మోస్ట్ ఇవప్రూవ్డ్ గా నిలిచింది. మోస్ట్ ఇప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాలుగా అస్సాం, ఏపీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, హర్యాణాలు టాప్-5లో నిలిచాయి. బెస్ట్ పెర్ఫార్మింగ్ విభాగాల్లో తమిళనాడు, హిమాచాల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, గుజరాత్ టాప్-5లో ఉన్నాయి. కొవిడ్ నియంత్రణకు సంబంధించి పెద్ద రాష్ట్రాల్లో అస్సాం 1వ ర్యాంకులో, తమిళనాడు 2, ఆంధ్రప్రదేశ్ 3వ ర్యాంకులో నిలిచాయి. తెలంగాణ 12వ స్థానంలో ఉంది.