నాడు త్యాగాలు చేసిన వారికే నేడు : గెలవకపోయినా మోపిదేవికి ఛాన్స్: జగన్ కోసం వారు చేసిందేంటి..!
జగన్ తన కేబినెట్ కూర్పులో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనను నమ్ముకున్న వారికి..తాను నమ్మిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయంగా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో తమ పదవులు వీడి తనతో కలిసి అడుగులు వేసిన వారికి మంత్రులుగా అవకాశం కల్పించారు. జగన్ ఎంచుకున్న కేబినెట్లో ఎక్కువగా వారే కనిపిస్తారు. ఇక, సమీకరణాల్లో భాగంగా కొంత మందికి అవకాశం ఇచ్చి..మరి కొంత మందికి ఇవ్వకపోయినా..తొలి నుండి తనతో ఉన్న వారిలో అధిక శాతం మందికి ఛాన్స్ ఇచ్చారు.
మంత్రి పదవులు వీడి...జగన్ కోసం
జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీని ఏర్పాటు చేసిన సమయంలో అనేక మంది కాంగ్రెస్- టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్కు మద్దతుగా నిలిచారు. ఇక, జగన్ పైన కేసులు నమోదు చేసి..ఎఫ్ఐఆర్లో వైయస్సార్ పేరు నమోదు చేయ గానే నాడు మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసారు. అప్పటి నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్తోనే ఉన్నారు. కొండా సురేఖ ఆ తరువాతి కాలంలో విభేదించి వెళ్లి పోయారు. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత పిల్లి బోస్కు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తాజా ఎన్నికల్లో ఆయనకు మండపేట టిక్కెట్ ఇచ్చారు. అయితే, ఆయన ఓడిపోయారు. కానీ, ఆయన తన కోసం మంత్రి పదవి వీడటంతో..ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇస్తూ..బీసీ కోటాలో డిప్యూటీ సీఎంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, బాలినేని శ్రీనివాస రెడ్డికి ఇచ్చిన హామీకి అనుగుణంగా మంత్రి పదవి కేటాయించారు.
మోపిదేవి గెలవక పోయినా..
గుంటూరు జిల్లా నుండి మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవి దక్కింది. వైయస్ హాయంలో ఆయన పెట్టుబడులు మౌళిక వసతుల శాఖా మంత్రిగా పని చేసారు. జగన్ పైన అక్రమాస్తుల కేసుల్లో నాడు మంత్రిగా పని చేసిన మోపిదేవిని సైతం వ్యాన్పిక్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. జగన్తో పాటుగా జైలు జీవితం అనుభవించారు. అయితే, 2014 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇచ్చినా ఓడిపోయారు. తిరిగి తాజా ఎన్నికల్లో రేపల్లో సీటు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓడినా.. జగన్ స్వయంగా మోపిదేవికి ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తున్నట్లుగా ఖరారు చేసారు. ప్రస్తుతం ప్రకటించిన కేబినెట్లో మోపిదేవి ఒక్కరే ఏ సభకూ చెందని వ్యక్తి. కష్ట సమయంలో తనతో పాటుగా ఉండటం..కష్టాలు వచ్చాయని తనను వీడి వెళ్లక పోవటంతో మోపిదేవి కి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు.
నాడు జగన్ కోసం రాజీనామాలు..
ఎమ్మెల్యేలుగా ఎన్నికై మూడేళ్లు కూడా కాకుండానే..జగన్ కోసం నాడు పదవులకు రాజీనామాలు చేసిన వారే ఇప్పుడు కేబినెట్లో అధికంగా ప్రాధాన్యత పొందారు. వారిలో ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుబాష్ చంద్రబోస్, తానేటి వనిత, ఆళ్ల నాని, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాస రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఉన్నారు. ఇక, అదే కోవకు చెందిన వారిలో ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన ప్రసాదరాజు, బాలరాజు, పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి , శ్రీకాంత రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, గొల్ల బాబూరావు వంటి వారు ఉన్నారు. అయితే, నామినేటెడ్ పదవుల్లో..భవిష్యత్ అవకాశాల్లో వారికి ప్రాధాన్యత ఇస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.