ఆ జగన్ ఈ జగన్ ఒక్కరేనా : చంద్రబాబు లెక్కలను డామినేట్ చేసేలా: టీడీపీలో అలజడి..!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు జగన్..ఏపీ ముఖ్యమంత్రిగా అయిన తరువాత జగన్ ఒక్కరేనా. ఈ అనుమానం ఎవరికో సాధారణ వ్యక్తులకు వచ్చింది. కాదు..టీడీపీ అధినేత కోటరీలో జరిగిన చర్చ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాలు..కేబినెట్ కూర్పు..తరువాత అనేక మంది ఇదే రీతిన స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ సమీకరణాలు..లెక్కలు అంటే చంద్రబాబు పేరు మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు జగన్ తన తొలి నిర్ణయంలోనే తన లెక్కలు ఎంత పవర్ ఫుల్గా ఉంటాయో చెప్పకనే చెప్పేసారు.
జగన్..నాడు - నేడు
ఎన్నికల ముందు జగన్ పైన ఎన్నో విమర్శలు. జగన్ కు పాలన ఏం తెలుసు. చంద్రబాబు సుదీర్ఘ అనుభవం.. పాలనా దక్షత అంటూ జగన్ ను చంద్రబాబుతో పోలుస్తూ విమర్శలు చేసేవారు. జగన్ సైతం అప్పట్లో ప్రతీ అంశానికి సీరియస్గా స్పందించేవారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ స్టైల్ మారిపోయింది. పూర్తి పరిణితి చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. తన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను తొలి వారంలోనే అమలు చేయటం ద్వారా టీడీపీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. అదే విధంగా ప్రధానంగా కేబినెట్ కూర్పు గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. రెడ్డి మంత్రులు ఎక్కువగా ఉంటారని భావిస్తే..కేవలం నలుగురికే పరిమితం చేయటం అంతు చిక్కలేదు. అందునా టీడీపీ బీసీల పార్టీ అని ఇక చెప్పకొనే అవకాశం లేకుండా చేసారా అనే సందేహం వారిలో కనిపిస్తోంది. బీసీలు.. కాపుల కు ప్రాధాన్యత ఇవ్వటం జగన్ వేసిన రాజకీయ ఎత్తుగడ ఖచ్చితంగా నష్టం చేస్తుందని భావిస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో ప్రాబల్యం..
జగన్ భవిష్యత్ పరిణాలను అంచనా వేస్తూ..అధికారంలోకి రావాలంటే కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టు నిలబెట్టుకొనేందుకు కొత్త సమీకరణాలను తెర మీదకు తెచ్చారు. తూర్పు గోదావరిలో కాపు-బీసీ-ఎస్సీ ఫార్ములా అదే విధంగా పశ్చిమ గోదావరిలో కాపు-క్షత్రియ- ఎస్సీ ఫార్ములాను అమలు చేసారు. టీడీపీ ప్రభుత్వం తూర్పు గోదావరిలో ఎస్సీకి అవకాశం ఇవ్వలేదు. అదే విధంగా పశ్చిమలో క్షత్రియకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే, జగన్ వ్యూహాత్మకంగా ఈ రెండు జిల్లాలకు బీసీ-కాపు కోటాల్లో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టి అందరినీ ఆశ్యర్య పరిచారు. ఇక, కర్నూలు నుండి బోయ, అనంతపురం నుండి కురుబ వర్గాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించి ఎన్నికల వేళ టిక్కెట్లు ఇచ్చేందుకు అనుసరించిన ప్రయోగాన్నే కొనసాగించారు. అక్కడ రెడ్డికి ఇవ్వకపోవటం ద్వారా ఎక్కువగా ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకొనేందుకు ఉపయోగపడుతుంది. ఉత్తరాంధ్ర నుండి స్పీకర్...ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం అనేది టీడీపీకి భవిష్యత్లో నష్టం చేసే నిర్ణయమే.
రెడ్ల రాజ్యం కాదు..సమతూకంతో నిర్ణయం
వైసీపీ అధికారంలోకి వచ్చి..జగన్ ముఖ్యమంత్రి అవుతే రెడ్డి వర్గానికే ప్రాధాన్యత దక్కుతుందని..టీడీపీ హయాంలో కమ్మ వర్గానికి చెందిన అధికారులకే ప్రాధాన్యత ఇచ్చారంటూ వైసీపీ ఆరోపణలు చేయగా..ఇప్పుడు వైసీపీ పైన టీడీపీ ఆరోపణలు చేసే అవకాశం వస్తుందని అంచనా వేసారు. అయితే, దీనికి భిన్నంగా జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా..రెడ్డి వర్గంతో సమానంగా కాపు వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. రెండు వర్గాల నుండి నలుగురు చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు ముగ్గురికే అవకాశం దక్కింది. ఇక, మైనార్టీ-ఎస్టీలకు పాలన చివర్లో ఇచ్చారు. చంద్రబాబు పాలనలోనూ రెడ్డి మంత్రుల సంఖ్య నాలుగే ఉండేది. టీడీపీ ప్రభుత్వం ఎస్సీలు ఇద్దరే మంత్రులుగా ఉండేవారు. ఇప్పుడు జగన్ అయిదుగురికి అవకాశం ఇచ్చారు. ఇలా ప్రతీ సామాజిక వర్గ పరంగా జగన్ నాటి చంద్రబాబును డామినేట్ చేసేలా సమీకరణాలతో టీడీపీ శిబిరంలో సైతం ఆ జగన్ ..ఈ జగన్ ఏనా అనే సందేహానికి కారణమయ్యారు.