సాయిరెడ్డికి జగన్ టార్గెట్ ఫిక్స్: విశాఖ గెలిస్తేనే..ఇజ్జత్ కా సవాల్: బాబు..పవన్ అడ్డుకోగలరా...!
వైసీపీలో ఇప్పుడు విశాఖ హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా గ్రేటర్ విశాఖలో జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. 2019 ఎన్నికల్లో విశాఖలో ఊహించని విధంగా సీట్లు దక్కించుకున్న వైసీపీ..ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక, ఏపీలో మూడు రాజధానులు..విశాఖ పరిపాలనా రాజధాని నిర్ణయం సైతం అక్కడి ప్రజలు అంగీకరిస్తున్నారని నిరూపించాలంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాదు ఈ ఎన్నికల ఫలితాలపైనే విజయసాయిరెడ్డి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందనే చర్చ జరుగుతోంది.
విజయ సాయి రెడ్డికి కీలకంగా మారిన స్థానిక పోరు
2014లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన జగన్ తల్లి విజయమ్మ అక్కడ బీజేపీ..టీడీపీ ఉమ్మడి అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఎంపీ సీటు గెలిచిన వైసీపీ..కార్పోరేషన్ గెలవాలని పట్టుదలతో ఉంది. దీంతో..ఈ బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విజయ సాయిరెడ్డికి అప్పగించారు. దీంతో..ఆయన చాలా కాలంగా అక్కడే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. పార్టీలో చేరికలు సైతం ఆయన సమక్షంలోనే జరిగిపోతున్నాయి. ఫలితం సానుకూలంగా వస్తే సాయిరెడ్డి పరపతి మరింత పెరగనుంది. ప్రతికూలంగా ఉంటే మాత్రం ఇబ్బంది కర పరిస్థితులు పార్టీలో తప్పవనే చర్చ ఉంది. ఇదే సమయంలో ఇక్కడ గెలుపు ముఖ్యమంత్రికి సైతం ప్రతిష్ఠాత్మకమే.
విజయసాయిరెడ్డికే బాధ్యతలు..
2019 సార్వత్రిక ఎన్నికల సమయం నుండి విశాఖ..ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయ సాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రత్యేకించి విశాఖ ను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించటంతో మరింతగా ఆయన భూమిక పోషిస్తున్నారు. అక్కడ ఏకపక్ష విజయం సాధించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ధేశించినట్లు సమాచారం. మంత్రి అవంతి ఇన్ ఛార్జ్ మంత్రి కన్నబాబుతో కలిసి ఆయన కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించటం పైనా ఎమ్మెల్యేలు..పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు తాజాగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు..విజయ కుమార్.. సీహెచ్ వెంకట్రామయ్యలు సాయిరెడ్డి సమక్షంలోనే వైసీపీలో చేరారు. ఇక, మొత్తం 98 వార్డులు ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో విజయం సాధించాలంటే వైసీపీ శక్తికి మించి పనిచేయాల్సిందే. ఇక్కడ గెలుపు బాధ్యతలు మీద వేసుకున్న సాయిరెడ్డికి ఎంత కీలకమో..ముఖ్యమంత్రి జగన్ కు వ్యక్తిగతంగా అంతే ప్రతిష్ఠాత్మకం.
అడ్డంకులు అధిగమిస్తారా..
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించటంతో ఖచ్చితంగా ప్రజలు తమకే పట్టం కడతారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజధాని విషయం కంటే ఎక్కువగా పెన్షన్ల రద్దు.. అన్న క్యాంటీ న్లు.. శానిటరీ వర్కర్ల జీతాలు పెంచకపోవడం, రేషన్కార్డుల తొగింపు వంటి అంశాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన సమయంలోనే నగరం నుండి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక, ఇక్కడ ఇప్పుడు టీడీపీతో పాటుగా బీజేపీ..జనసేన కూటమి సైతం ప్రభావం చూపించే అవకాశం ఉంది. గతంలో ఎంపీగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటుగా పవన్ కళ్యాణ్ ను అక్కడి ప్రజలు ఓడించారు. పవన్ కళ్యాణ్ విశాఖలో ఇసుక సమస్య పైన నిర్వహించిన లాంగ్ మార్చ్ కు మంచి స్పందన వచ్చింది. అయితే, జనసేన నుండి పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఇప్పుడు పార్టీని వీడారు. ఇక, టీడీపీ నేతలు సైతం అక్కడ పట్టు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ కు రాజధాని వ్యవహారం ఎంత వరకు మేలు చేసేదీ ఎన్నికల ఫలితాల్లో వెల్లడి కానుంది. అయితే, ముఖ్యమంత్రి తన మీద ఉంచిన బాధ్యతలను విజయ సాయిరెడ్డి ఎంత వరకు సక్సెస్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.
Recommended Video
చంద్రబాబు..పవన్ కు ప్రతిష్ఠాత్మకమే
మూడు రాజధానుల వ్యవహారంలో అమరావతి నుండి రాజధాని తరలింపు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..బీజేపీ నేతలు అమరావతి ప్రజలకు మద్దతు ప్రకటించారు. అయితే, జనసేన..బీజేపీకి ఇక్కడ ఎమ్మెల్యేలు లేకపోయినా..కేడర్ ఉంది. అదే విధంగా టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికే ఇప్పుడు టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేకే మేయర్ సీటు ఇస్తామంటూ తమ పార్టీలోకి రావాలని వైసీపీ ఆహ్వానిస్తోంది. అదే సమయంలో వైసీపీ నుండి ఇద్దరు యువనేతలను మేయర్ అభ్యర్ధులుగా పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి సైతం విశాఖలో పార్టీ నేతలు అమలు చేస్తున్న వ్యూహాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో..ఇప్పుడు విశాఖ ఫలితం అధికార పార్టీకే కాదు... టీడీపీ..జనసేన కు సైతం కీలకంగా మారనుంది.