జగన్కు ఏసుప్రభువు లేడు వెంకన్న లేడు..ఆయన్ను నియంత్రించే వ్యక్తి ఒక్కరే : జేసీ హాట్ కామెంట్స్
తాడిపత్రి: ఏపీలో అరెస్టుల పర్వం టీడీపీలో గుబులు రేపుతోంది. నిన్న ఈఎస్ఐ స్కామ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన ఏసీబీ.. నేడు అనంతపురం పోలీసులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అతని కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి అనంతపురంకు తరలించారు. తన సోదరుడి అరెస్టుపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. అంతేకాదు టీడీపీ నాయకులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
మరో వివాదంలో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులు, ఓ ఎమ్మెల్యే- కోడలి ఫిర్యాదు- అట్రాసిటీ కేసు...
జగన్కు ఏసుప్రభువు లేడు..తిరుపతి వెంకన్న లేడు
ఏపీలో జగన్ కక్ష్యపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టులను తీవ్రంగా ఖండించిన దివాకర్ రెడ్డి... రాష్ట్రం ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. జగన్ మొండిగా వెళుతుండటం ఆయనకు శ్రేయస్కరం కాదని చెప్పారు. ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో జగన్ లేరని నిప్పులు చెరిగిన జేసీ దివాకర్ రెడ్డి... జగన్కు ఏసుప్రభువు లేడు, తిరుపతి వెంకన్న లేడు, అల్లా లేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తానొక్కరు మాత్రమే సర్వశక్తి సంపన్నుడిలా భావిస్తున్నాడని చెప్పారు. . త్వరలో తనను కూడా అరెస్టు చేస్తారని ఇందులో సందేహమే అక్కర్లేదని జోస్యం చెప్పారు దివాకర్ రెడ్డి. ఇక జగన్ను కంట్రోలో చేయగల కెపాసిటీ ఒక్క మోడీకి మాత్రమే ఉందని జేసీ వ్యాఖ్యానించారు. తనను వైసీపీలో చేరాలని గత కొన్నిరోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పిన జేసీ... అందుకు తాను సమ్మతించలేదని అందుకే తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని అన్నారు.
టీడీపీ నేతలను జగన్ టార్గెట్ చేశారు: చంద్రబాబు
ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు దారుణమని అన్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వారి అరెస్టులను ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలు గుర్తించారు కనుకే ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రాష్ట్రంలో అరెస్టుల పర్వానికి తెరతీశారని మండిపడ్డారు చంద్రబాబు. జగన్ ప్రతీకారంతో రగిలిపోతున్నారని చెప్పిన చంద్రబాబు... ప్రజా సమస్యలపై టీడీపీ చేస్తున్న పోరును ఓర్వలేకే అరెస్టులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ జైలుకు వెళ్లాడని అందువల్ల మిగతా వాళ్లు కూడా జైలుకు వెళ్లాలనే బలమైన కోరిక ఆయనలో నాటుకుపోయిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు
టీడీపీ నేతలను కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన ప్రజా సమస్యలపై , ప్రభుత్వ తప్పుడు విధానాలపై పోరాటం చేయడంలో టీడీపీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. అంతేకాదు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని బాబు స్పష్టం చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ప్రజాసంఘాలు, మేధావులు, జగన్ ప్రభుత్వ అరాచకాలను ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయ్యారన్న విషయం తెలియగానే అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్ పై 24 కేసులు నమోదయ్యాయి.