రుణాల విషయంలో పెద్ద మనసు చేసుకోండి.. బ్యాంకర్లకు జగన్ వినతి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పథకాలకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని కోరారు. రుణాలు ఇచ్చే విషయంలో ఔదార్యం చూపాలని కోరారు. కరోనా వైరస్ వల్ల నిధుల కొరత రానివ్వకుండా బ్యాంకులు అందించిన సహకారం అభినందనీయం కొనియాడారు. ఇవాళ 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది.
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ బ్యాంకర్లకు వివరించారు. 2020-21 ఖరీఫ్ సీజన్ లో రూ.75,237 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్దేశించుకున్నామని వివరించారు. ఇప్పటి వరకు రూ.62,650 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.1,110 కోట్ల పారిశ్రామిక రాయితీ అందించినట్టు సీఎం జగన్ వెల్లడించారు. ఎన్నో పథకాలకు బ్యాంకర్లు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించి ఆటంకాలు కలుగకుండా చూడాలని.. పేదల సంక్షేమం కోసం ఆ పథకాలను ప్రవేశపెట్టామని కోరారు. రైతులు, చిన్న వర్తక వ్యాపారులను పట్ల ఉదారంగా వ్యవహరించాలని.. మార్కెట్ లేనందున రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.