టీడీపీ-జనసేన ఓట్ బ్యాంకు పై సీఎం జగన్ కౌంటర్ స్ట్రాటజీ..!!
ఏపీ సీఎం జగన్ ఎన్నికల వ్యూహాను పదును పెడుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని వర్గాలను దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన ఎంట్రీతో ఏపీలో కొన్ని జిల్లాలో సామాజిక ఓట్ బ్యాంకుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. సర్వే నివేదికలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో, వెంటనే జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా బీసీ ఓట్ బ్యాంకు ను కాపాడుకోవటం పైన కొత్త ప్రణాళిలు సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం జిల్లాల వారీగా కొత్త కార్యాచరణ సిద్దం అవుతోంది. సామాజిక వర్గాల సమీకరణాలతో మొత్తంగా పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
సామాజిక సమీకరణాల్లో లెక్క పక్కా..
ఈ సారి టీడీపీతో కలిసినా..కలవక పోయినా ఉభయ గోదావరి జిల్లాలో అనుకూల ఓట్ బ్యాంక్ పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన వర్గాల ఓటింగ్ లో చీలక తెచ్చేందుకు జనసేన - టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. జనసేన ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కాపు ఓట్ బ్యాంకు అనుకూలంగా మలచుకొనే వ్యూహాలు అమలు చేస్తోంది. అదే సమయంలో గతంలో వైసీపీకి అండగా ఉన్న బీసీ వర్గాల పైన టీడీపీ కొత్త లెక్కలు సిద్దం చేస్తోంది.
దీనిని పసిగట్టిన సీఎం జగన్ ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఆ రెండు సామాజిక వర్గాల ఓట్ బ్యాంకు మళ్లకుండా చర్యలు ప్రారంభించారు. కాపు నేస్తంతో పాటుగా.. కాపుల కోసం ఇంకా ఏం చేయగలం అనే అంశం పైన పార్టీలో కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో..రాజకీయంగానూ కాపు ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించే మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కాపు వర్గానికి చెందిన ప్రముఖలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీ గర్జలనకు రంగం సిద్దం...
2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ కులాల కార్పోరేషన్లు ఏర్పాటు చేసారు. బీసీలకు పదవుల విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా బీసీ బడ్జెట్ పెంచిన విషయాన్ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు బీసీలకు ఏం చేసామో చెప్పటంతో పాటుగా.. ఇంకా ఏం చేయాలో అధ్యయనం చేసే బాధ్యతను బీసీ మంత్రులు - పార్టీలోనీ సీనియర్ బీసీ నేతలకు సీఎం అప్పగించారు. చేస్తున్న అంశాలను ప్రచారం చేయటంతో పాటుగా.. బీసీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతీ జిల్లాలో బీసీ గర్జనలకు నిర్ణయించారు.
ప్రస్తుతం వైసీపీలోని బీసీ మంత్రులు..పార్టీ నేతల సమావేశం జరుగుతోంది. జగన్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, వాటిని వారికి ఏ విధంగా వివరించాలి తదితర అంశాలపై వీరంతా చర్చిస్తున్నారు. తరువాత సీఎం జగన్ ను కలిసి తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఆ తరువాత బీసీ వర్గాలకు దగ్గరయ్యేలా కొత్త కార్యాచరణ ప్రణాళికను పార్టీ ప్రకటించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
అటు జనసేన - ఇటు ఓట్ బ్యాంకులపై గురి
ముఖ్యమంత్రి జగన్ బీసీ గర్జన ద్వారా ఆ వర్గాలను పూర్తిగా దగ్గర చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ తొలి నుంచి బీసీ అనుకూల పార్టీగా ముద్ర ఉంది. 2019 ఎన్నికల్లో ఆ ముద్ర చెరిగిపోయింది. అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాలతో బీసీలంతా వైసీపీతోనే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో సామాజిక వర్గాల వారీగా ఉన్న వైరుధ్యాలు పార్టీలకు కీలకంగా మారుతున్నాయి.
దీంతో, ఏ వర్గం దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సామాజీక సమీకరణాలే గెలుపు ఓటమలను డిసైడ్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, అటు పవన్ - చంద్రబాబు, ఇటు సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యూహాలు ఏ మేర ఓట్లను కురిపిస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.