శారదా పీఠంలో రాజశ్యామల యాగంలో సీఎం జగన్ .. ఎన్నికల సమయంలో ఏపీలో ఆసక్తికర చర్చ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి విశాఖ శారదా పీఠానికి వెళ్ళారు . శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఒకపక్క విశాఖలో విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కూడా సీఎం జగన్ శారదా పీఠానికి వెళ్లి రాజ శ్యామల యాగంలో పాల్గొనటంపై ఏపీలో ఆసక్తికర చర్చ సాగుతుంది.
ఆదాయం కోసం వేట మొదలెట్టిన సీఎం జగన్ .. ఎర్రచందనం , మైనింగ్ పై ఫోకస్, కీలక ఆదేశాలు
విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలలో పాల్గొన్న జగన్
విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షిక ఉత్సవాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలతో మాట్లాడిన అనంతరం సీఎం జగన్ నేరుగా శారదాపీఠం చేరుకున్నారు . విశాఖలో ఉక్కు ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా సీఎం జగన్ శారదా పీఠం వార్షికోత్సవాలలో పాల్గొన్న జగన్ అక్కడ ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.
రాజశ్యామలా యాగంలో పాల్గొన్న జగన్ .. అమ్మవారికి ప్రత్యక పూజలు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవ మూర్తి , దాసాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్న సీఎం జగన్ అనంతరం రాజ శ్యామల యాగంలో పాల్గొన్నారు. రాజ శ్యామల అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగన్ అక్కడ స్వామీజీ లతో కలిసి గోపూజ, శమీ వృక్ష ప్రదిక్షణలో పాల్గొన్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాటి నుండి నేటి వరకు సీఎం జగన్ శారదాపీఠంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో రాజశ్యామలా దేవికి పూజలపై ఆసక్తికర చర్చ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన పలు సందర్భాల్లో శారదాపీఠాన్ని సందర్శించారు . గతంలో కూడా అయన రాజ శ్యామలా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . అప్పట్లో అది చర్చనీయాంశం అయింది. గత ఎన్నికల ముందు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా రాజశ్యామలా దేవికి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే . ఇప్పుడు ఏపీలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఒక పంచాయతీ ఎన్నికలు , మరోపక్క మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం , జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ .. యాగం పై ఫోకస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అనేక గందరగోళ పరిస్థితులు సీఎం జగన్ కు ఊపిరి ఆడనివ్వటం లేదు . ఒకపక్క సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ వేగంగా సాగుతోందని సమాచారం . ఈ సమయంలో జగన్ రాజ శ్యామలా యాగం చెయ్యటం ప్రస్తుతం ఉన్న సమస్యల గట్టెక్కటానికేనా అన్న చర్చ జరుగుతుంది . సీఎం జగన్ శారదా పీఠానికి వెళ్ళటం ఒక ఎత్తయితే అక్కడ ముఖ్యంగా రాజ శ్యామలా యాగం చెయ్యటంతో ఒక్కసారిగా అందరి ఫోకస్ జగన్ మీద పడింది .
అధికారం కోసమే రాజ శ్యామలా యాగం .. గతంలో కేసీఆర్ కూడా
అప్పుడు సీఎం కేసీఆర్ కూడా అధికారం కోసమే విశాఖ వెళ్లి మరీ అమ్మవారికి పూజలు చేశారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు జగన్ కూడా శారదా పీఠంలో రాజశ్యామల యాగం చెయ్యటం ఆసక్తికరంగా మారింది. అధికారం సుస్థిరం చేసుకోవటం కోసం రాజశ్యామల యాగం చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు సీఎం జగన్ రాజశ్యామలా యాగం చెయ్యటం కూడా అంతే ఆసక్తిని కలిగిస్తుంది. నేటి నుండి శారదాపీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభం కాగా, తొలి రోజున సీఎం జగన్ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ,ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి.