సీఎం జగన్ ఆరోగ్య వరాలు: పక్షవాత..తలసేమియా బాధితులకు పెన్షన్లు: పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శ్రీ ..!
నేను అనంత జిల్లా మనవడిని..జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ అనంతపురం లో కంట వెలుగు ప్రారంభ సభలో హామీ ఇచ్చారు. ఆరోగ్య పరంగా అనేక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనారోగ్యంతో ఉన్న వారికి కొత్త వరాలు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ కింద రెండు వేల వ్యాధులకు చికిత్స అందిస్తామని చెప్పుకొచ్చారు. ఏపీతో పాటుగా చెన్నై..బెంగళూరు.. హైదరాబాద్ లోని 150 ఆస్పత్రులతోనూ అగ్రిమెంట్ చేసుకున్నామని అక్కడ కూడా ఏపీ ప్రజలక ఉచితంగా చికిత్సలు అందుతాయని వెల్లడించారు.
అదే విధంగా తలసేమియా..పక్షవాతానికి గురైన వారికి నెలకు అయిదు వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతీ వ్యాధి ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొస్తామన్నారు. వైద్యం...విద్య..వ్యవసాయం రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. డయాలసిస్ పేషంట్లకు పది వేలు చొప్పున ఇస్తామని వెల్లించారు. 108,104 అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు సీఎం జగన్.
కంటివెలుగు ప్రారంభం..
కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ అనంతపురంలో ప్రారంభించారు. రూ.560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. మూడేళ్లలో ఆరు దశల్లో కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తామన్నారు. మొదటి రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 3, 4, 5, 6 దశల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నాలుగు దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు.
పక్షవాత..తలసేమియా..డయాలసిస్ రోగులకు పెన్షన్లు..
ముఖ్యమంత్రి జగన్ ఇదే వేదికగా పలు వరాలు ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్య..వైద్యం..వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా పక్షవాతం బారిన పడిన వారికి అదే విధంగా తలసేమియా కారణంగా ఇబ్బంది పడుతున్న రోగులకు ప్రభుత్వం నుండి నెలకు అయిదు వేల చొప్పున పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. అదే విధంగా డయాలసిస్ రీసెర్చ్ కోసం సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూనే.. వారికి నెలకు పది వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆపరేషన్లు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో నెలకు అయిదు వేలు చొప్పున సాయం అందిస్తామని.. వారు ఎంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తూ అంతకాలం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు..
ఇక, ఇప్పటి వరకు ఉన్న వ్యాధులతో కలిసి దాదాపు రెండు వేల వ్యాధులకు ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద సేవలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. వెయ్యి రూపాయలు దాటిని ప్రతీ సమస్యకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తామన్నారు. కేవలం ఏపీలోనే కాకుండా..పొరుగు రాష్ట్రాల్లోని మొత్తం 150 కార్పోరేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నామన్నారు. డిసెంబర్ 21 నుండి ఆరోగ్య శ్రీని అందుబాటులోకి తీసుకొస్తామని.. త్వరలో పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి నుండి ప్రారంభిస్తామని చెప్పారు. ఇక, మూలన పడిన 108, 104 వాహనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామని.. వచ్చే మార్చి నాటికి పూర్తిగా సేవలు అందిస్తాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు.