మీ బిడ్డ సీఎం కాదు..సేవకుడు: చెప్పిన దానికంటే ముందుగా..మిన్నగా: రైతు భరోసాలో సీఎం జగన్..!
ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పధకాన్ని ప్రారంభించారు. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా కాదు..సేవకుడిగా వచ్చానంటూ సెంటిమెంట్ పండించారు. అర్హత కలిగిన ఏ రైతుకు అన్యాయం జరగకుండా పధకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నా చెప్పిన సమయం కంటే ముందుగా..చెప్పిన దాని కంటే మిన్నగా పధకం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. దీని ద్వారా రైతు చరిత్రలోనే మార్పు ప్రారంభం అవుతుందన్నారు.
పార్టీ ప్లీనరీలో చేసిన ప్రకటన మేరకే..మేనిఫెస్టోలో తొలి హామీగా చేర్చామని..ఇప్పుడు చెప్పిన దాని కంటే ఎక్కువ మొత్తంలో రైతులకు అందేలా చేస్తున్నామన్నారు. మొత్తంగా ఈ పధకం ద్వారా 51 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతీ ఇరిగేషన్ ప్రాజెక్టును యుద్ద ప్రాదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతు రభరోసాలో పేర్ల నమోదుకు మరో నెల రోజుల పాటు గడువు పొడిగిస్తున్నామని..సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.
చెప్పిన దాని కంటే ముందుగా..మిన్నగా..
ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తాను చెప్పిన మాట మీద నిలబడటం కోసం రాష్ట్రంలో ఎన్ని రకాలు ఆర్దిక సమస్యలున్నా.. అన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పు కొచ్చారు. తాము తీసుకున్న నిర్ణయాల కారనంగా రైతు చరిత్రలోనే మార్పు ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. మొత్తం 13 జిల్లాల్లోని 40 లక్షల మందికి ఒకే సారి నగదు జమ అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. తాను పార్టీ ప్లీనరీ సమావేశంలో అయిదు ఎకరాలు లోపు ఉన్న రైతులకు 50 వేల వరకు సాయం అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. అదే విధంగా మేనిఫెస్టోలో తొలి వాగ్దానంగా చేర్చామన్నారు. అందులో చెప్పిన సమయం..మొత్తం కంటే ముందుగా..మిన్నగా పధకం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 8 నెలల ముందుగానే ఈ పధకం అమలు చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
చెప్పింది 50 వేలు..ఇవ్వబోతోంది రూ. 67,500..
వచ్చే మే నెల నండి పధకం ప్రారంభిస్తామని చెప్పినా..ఈ నెల నుండే ఈ స్కీం అమల్లోకి తెచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. రూ. 12,500 ఇస్తామని చెప్పినా..ఇప్పుడు దానిని రూ.13,500 కు పెంచామన్నారు. నాలుగేళ్లుగా తొలుత ప్రకటించినా..దానిని ఇప్పుడు అయిదేళ్లకు పెంచామని చెప్పుకొచ్చారు. దీని కారణంగా రైతుకు ఇచ్చిన హామీ కంటే రూ.17,500 ఎక్కువగా అందుతుందని చెప్పారు.
వచ్చే ఏడాది నుండి ఖరీఫ్ సమయానికి మే లో రూ 7500, అక్టోబర్ రూ 4000, సంక్రాంతికి రెండు వేలు ఇస్తామని ప్రకటించారు. ఎస్సీ..ఎస్టీ..బీసీ..మైనార్టీలల్లో భూములు లేని వారికి సైతం ప్రయోజనం అందే విధంగా పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పధకం అమలు కోసం మరో నెల రోజుల పాటు పేర్ల నమోదుకు అవకాశం ఇస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న విధానంలో అర్హులైన ప్రతీ ఒక్కరూ ఎన్ రోల్ చేయించుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలోనూ లబ్దిదారుల జాబితాను ప్రదర్శిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారం 43 లక్షల మంది రైతులు ఉన్నట్లుగా తేల్చితే.. ఇప్పుడు 51 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తేలిందన్నారు.
యుద్దప్రాతిపదికన ఇరిగేషన్ ప్రాజెక్టులు..
వచ్చే జూలై నుండి తాము ఇచ్చిన హామీ మేరకు ఉదయం వేళ 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఇక, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రతి ప్రాధాన్యత ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. ఈ రోజు రైతు భరోసా కింద 40 లక్షల మందికి ఇస్తున్నామని.. ప్రతీ వారం కొత్తగా చేర్చిన లబ్దిదారులకు నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నెల్లూరు జిల్లా తమకు పూర్తగా అండగా ఉందని..ఆ జిల్లాకు ఏం చేసినా రుణం తీర్చుకోలేనని సీఎం వ్యాఖ్యానించారు. అందుకే నెల్లూరు జిల్లాకు ఇరిగేషన్ మంత్రిని కేటాయించామని చెప్పుకొచ్చారు.