'జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష': తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిని పాతి భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్
ఏపీలో భూముల సర్వే ప్రారంభమైంది. కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడు వద్ద వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్నిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు . తక్కెళ్ళపాడులో సర్వే రాయి పాతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. భూముల రీ సర్వే వివరాలను, సర్వే తర్వాత ఫలితాలను సీఎం జగన్ కు అధికారులు వివరించారు.
కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడులో భూముల రీ సర్వేకు ప్రారంభించిన జగన్
తెలంగాణ సరిహద్దు గ్రామమైన కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడులో సీఎం జగన్ తన పుట్టినరోజు నాడు భూముల సమగ్ర రీ సర్వే కు శ్రీకారం చుట్టారు. దీంతో ఈనెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సర్వే ప్రారంభం కానుంది. మొదటి దశలో 5 వేల గ్రామాల్లో, రెండవ దశలో 6500 గ్రామాల్లో, మూడవ దశలో 5500 గ్రామాల్లో భూముల సర్వే చేపట్టనున్నారు అధికారులు. వందేళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైందని ఈ కార్యక్రమంపై వైసీపీ శ్రేణులు కొనియాడుతున్నారు.
మూడు విడతల్లో1.26 కోట్ల హెక్టార్లలో రీ సర్వే
మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో చేపట్టి 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం ఈ సర్వే నిర్వహణకు ఆయా జిల్లాలలో కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చి సర్వే ఎప్పుడు జరుగుతుందన్న వివరాలను తేదీల వారీగా వెల్లడిస్తారని పేర్కొంది. ఈ సర్వేలో కొలతలు ఖచ్చితంగా ఉంటాయని, భూముల పంచాయతీ లు కూడా త్వరితగతిన పరిష్కారమవుతాయని, రాష్ట్రంలోని ప్రజలందరికీ భూములకు భద్రత లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
Recommended Video
వందేళ్ళ క్రితం భూసర్వే .. మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో
ఇది ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత నిర్ణయం అని , సమగ్ర భూ సర్వే పై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు దశాబ్దాలుగా వివాదాల్లో ఉండి పరిష్కారం కాని భూములకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న వాదన వినిపిస్తుంది . ఇదే సమయంలో భూముల సమగ్ర సర్వేతో కొత్త సమస్యలు వస్తాయా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది . సుమారు వందేళ్ల క్రితం 1920-27 మధ్యలో భూముల సర్వే జరిగింది. మళ్లీ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీ సర్వే కొనసాగనుంది. అయితే ఈసారి సర్వే వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.