జగన్ అసలు లక్ష్యం అదే.. సీఎం పదవితో ఆగేది లేదు: ఆది సెన్సేషన్
రాష్ట్రాన్ని కరోనా కబళిస్తున్న నేపథ్యంలో ఏపీలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చాలా కాలం తర్వాత ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. కరోనాపై సాగిన చర్చ చిన్నగా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ పదవిపైనే జగన్ కన్నేశారు
కరోనావైరస్ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానెల్ నిర్వహించిన చర్చలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. జగన్ మొండి ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆదినారాయణరెడ్డి అన్నారు. కరోనావైరస్ ఎంత ప్రమాదమైనదో జగన్కు తెలియనిది కాదని చెప్పిన ఆదినారాయణ రెడ్డి..జగన్ అమాయకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ దృష్టి ఇప్పుడు కరోనావైరస్ నియంత్రణపై లేదని ఎప్పుడెప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకుందామా అనే ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. అంతేకాదు తనకు వయస్సు చాలా ఉందని ప్రధాని పదవిపైనే జగన్ స్కెచ్ వేశారని ఆరోపణలు చేశారు ఆదినారాయణ రెడ్డి.
తాను చెప్పిందే జరగాలనే మనస్తత్వం
కరోనావైరస్ ఇంత తీవ్రంగా ఉంటే ముఖ్యమంత్రి హేళన చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు ఆదినారాయణ రెడ్డి. కరోనావైరస్పై అసలు నిజాలను ప్రభుత్వం దాస్తోందని మండిపడ్డారు. ఇక జగన్ ఆలోచనంతా పొలిటికల్గానే ఉందని ఆరోపణలు చేసిన ఆదినారాయణ రెడ్డి.... రాష్ట్రంలో అన్ని పార్టీలను తుంగలో తొక్కాలనే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నారని ఫైర్ అయ్యారు. తను చెప్పిందే జరగాలనే మనస్తత్వం జగన్ది అని అన్నారు. కరోనాపై పోరుకు డబ్బులు లేక కాదని ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పిన ఆదినారాయణ రెడ్డి ఇతర శాఖల నుంచి ఈ కష్ట సమయంలో నిధులు ఎందుకు వినియోగించుకోకూడదని ప్రశ్నించారు.
నిమ్మగడ్డ ఉంటే జగన్ ఆటలు సాగవు
ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే ఒకే ఒక ఆశయంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని ఈ క్రమంలోనే అడ్డగోలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించడం జరిగిందన్నారు. నిమ్మగడ్డ ఉంటే అది సాధ్యం కాదుకనుక ఆయన్ను తప్పించేందుకు పావులు కదిపారని ఆరోపించారు ఆదినారాయణ రెడ్డి. జగన్కు అధికారులను తొలగించడం చాలా సులువైన పని అని ఇందుకు నిదర్శనం గతంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యంను తొలగించడమే అని గుర్తు చేశారు ఆదినారాయణ రెడ్డి. ఎన్నికల కమిషనర్గా కనగరాజ్ ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియడం లేదని చెప్పారు. చేయని తప్పును ప్రశ్నిస్తున్న పార్టీలపై వేయడం... చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం జగన్కు పరిపాటైపోయిందని ధ్వజమెత్తారు ఆదినారాయణ రెడ్డి.
వాలంటీర్లతో కలిసి వైసీపీ అభ్యర్థులే డబ్బులు పంచుతున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు జగన్ సర్కార్ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు ఆదినారాయణ రెడ్డి. డబ్బులు మద్యం పంచుతున్న వారికి శిక్ష వేస్తామని అందులో ప్రస్తావించారని అయితే వాలంటీర్లతో కలిసి వైసీపీ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు ఆదినారాయణ రెడ్డి. మతం పేరు ఎక్కడా ప్రస్తావించరాదని చెబుతున్న జగన్... మర్కజ్కు వెళ్లిన వారి సంఖ్య ఇంత ఉందని ఆయనే చెబుతారని మండిపడ్డారు ఆది. జగన్కు ప్రజలు, వ్యవస్థలు, హైకోర్టులు, ప్రధాని మోడీ అన్నా లెక్కలేదని ధ్వజమెత్తారు. ప్రజలు ఎలా పోతే ఏంటి తన మాట నెగ్గాలనేది జగన్ మనస్తత్వం అని చెప్పారు.
ఎన్నికలు అక్కడ మాత్రమే నిర్వహించాలన్న ఆలోచన దారుణం
రెడ్ జోన్లు అని చెప్పి అక్కడ మాత్రమే ఎన్నికలు నిలిపివేసి మిగతా చోట్ల ఎన్నికల నిర్వహణకు జగన్ ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. కరోనావైరస్ అన్ని చోట్లా ఉందని చెప్పిన ఆదినారాయణ రెడ్డి ... మర్కజ్కు పోయినవారికే కాదు ఇతరులకు కూడా వ్యాధి సోకిందని చెప్పారు. మాస్కులు ఇప్పుడు ఇచ్చి ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ది కేవలం పొలిటికల్ మైండ్ సెట్ మాత్రమే ఉందని ఆయన మాట నెగ్గించుకునేందుకు మాత్రమే అధికారులను భయపెట్టి పనిచేయించుకుంటున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు చేశారు.