రాజధాని తరలింపుపై తొందరలేదు: ప్రజలకు అన్నీ చెప్పే చేద్దాం: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ మొత్తం ఆసక్తి కరంగా ఎదురు చూసిన రాజధాని తరలింపు నిర్ణయం పైన ఆచి తూచి ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీ సిఫార్సుల మీద సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అధికారులు కమిటీ సిఫార్సులను మంత్రివర్గానికి వివరించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ఈ కమిటీ సిఫార్సుల పైన ప్రతీ ఒక్క మంత్రి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు.
జీఎన్ రావు కమిటీతో పాటుగా బీసీజీ నివేదిక పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఈ రెండు నివేదికల పైన హై లెవల్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే, ఆ సమయంలో కొందరు మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. దీనికి స్పందనగా ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
తరలింపు పైన తొందరలేదు..
కేబినెట్ సమావేశంలో రాజధాని తరలింపు పైన చర్చ సమయంలో ముఖ్యమంత్రి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. జీఎన్ రావు కమిటీ కంటే ముందుగానే తాను అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినట్లుగా సమాచారం. రెండు కమిటీ నివేదిక రావాల్సి ఉందని..రెండో సంస్థ అయిన బోస్టన్ కన్సల్టెటెంట్ గ్రూప్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని..జనవరి 3న అది అందుతుందని సీఎం చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో మంత్రుల అభిప్రాయాలు సేకరంచారు. ఈ రెండు నివేదికల పైన ఒక హై లెవల్ కమిటీ వేసి మూడు వారాల్లో వారిచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్దామని సీఎం ప్రతిపాదించారు. ఆ సమయంలో కొందరు మంత్రులు సైతం తమకు ఎటువంటి కమిటీ అవసరం లేదని..సీఎంగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అనుసరిస్తామని చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే సీఎం రాజధాని తరలింపు విషయంలో తొందర లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం
అందరికీ వివరించి..ముందుకెళ్దాం..
ఇదే సమయంలో హైలెవల్ కమిటీ నివేదిక మూడు వారాల్లో వచ్చేలా చూడాలని నిర్ధేశించారు. అదే సమయంలో ఉద్యోగుల బదలాయింపు..కార్యాలయాల తరలింపు పైన నివేదిక అందనుంది. దీని కోసం ఉద్యోగ సంఘాల నేతలు..మంత్రులు..ఐఏయస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ జనవరి మూడో వారినికి పూర్తి చేయాలని సూచించారు.
రాజధాని గురించి అన్ని ప్రాంతాల ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పిన తరువాతనే ముందుకు వెళ్లాలని సీఎం తన ఆలోచనగా చెప్పుకొచ్చారు. ఇందు కోసం గతంలో చంద్రబాబు తరహాలో కాకుండా.. ఈ అంశం మీద అఖిలపక్షం ఏర్పాటు చేసి వివరిద్దామని చెప్పారు. ఆ తరువాత జనవరి మూడో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సభ నుండే రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు మన ఉద్దేశం వివరిద్దామని సీఎం వ్యాఖ్యానించారు.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ తరహాలో..
ఇదే సమయంలో అమరావతిలో రాజధాని నిర్మిస్తే లక్ష కోట్లకు పైగా ఖర్చు అవసరమని సీఎం వివరించినట్లు తెలుస్తోంది. అంత భారీ ఖర్చు ఒకే ప్రాంతంలో పెట్టుబడిగా పెడితే ఇతర ప్రాంతాల మీద ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. విశాఖలో మౌళిక వసతులు సిద్దంగా ఉన్నాయని..కొద్ది పాటి ఖర్చుతో..అతి త్వరలోనే హైదరాబాద్ తరహాలో డెవలప్ చేసుకోగలుగుతామని ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలో వివరించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో తాము తీసుకొనే నిర్ణయం ఏ ప్రాంతం వారికి వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు. ప్రజలకు ఎన్నికల ముందు అనేక కమిట్ మెంట్స్ ఇచ్చామని.. ఇరిగేషన్ కు భారీగా నిధులు కేటాయించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇవన్నీ.. ప్రజలకు శాసనసభ ద్వారా ప్రజలకు వివరించి..నిర్ణయం అమలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం.