కొన ఊపిరితో కౌన్సిల్.. సీఎం జగన్ సూపర్ సస్పెన్స్.. అసెంబ్లీలో సుదీర్ఘ స్పీచ్.. తర్వాత?
మూడు రాజధానులు ఏర్పాటుకు సబంధించిన రెండు బిల్లులపై శాసన మండలిలో జరిగిన పరిణామాలు చాలా బాధించాయని, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడిపోయిన పార్టీ అడ్డుకోవడం చట్టవిరుద్ధమని ముఖ్యమంత్రి వైస్ జగన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఏర్పాటు చేసిన మండలి వ్యవస్థ.. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అదికూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని, కాబట్టి ఆ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని ప్రజలందరూ ఆలోచించాలన్నారు. మండలి రద్దుపై గురువారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన.. చివర్లో సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఆయనేం చెప్పారంటే...
ప్రజల చేత.. ప్రజల కోసం..
‘‘శాసన మండలిలో జరిగిన పరిణామాలు నా మనసును చాలా బాధించాయి. ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ లు ఉంటాయి.. ఉండాలి కూడా. నేను ఏరోజూ వాటికి వ్యతిరేకం కాదు. అయితే అవి చట్టాన్ని, నిబంధనల్ని కాపాడటానికి ఉండాలే తప్ప.. అధికారాన్ని ఆర్బిటరీగా వాడుకోడాని కాదు. అలాంటి పరిస్థితే ఉంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ 151 సీట్లు.. అంటే 86 శాతం మంది ఎమ్మెల్యేలతో ఈ సభ ఏర్పడింది. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడిన ప్రజల సభ ఈ అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో చేసిన బిల్లుల్ని మండలిలో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం?
బాబు కనుసన్నల్లో..
శాసన మండలి అనేది చట్టసభలో భాగమైన వ్యవస్థ కాబట్టి అది చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని అందరం నమ్మాం. కానీ ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ బుధవారం రాత్రి మండలిలో జరిగిన తంతును మనమంతా గమనించాం. గ్యాలరీలో చంద్రబాబు కూర్చొని దిశానిర్దేశం చేయడాన్నిబట్టి శాసన మండలి చైర్మన్ నిబంధనల ప్రకారం సభ నిర్వహించే పరిస్థితి లేదని అర్థమవుతోంది. చైర్మన్ ప్రసంగాన్ని రాష్ట్రప్రజలంతా తప్పకుండా చూడాలి. (మధ్యలో సీఎం స్పీచ్ ఆపేసి మరీ మండలి చైర్మన్ వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు)
తప్పు చేశానని చైర్మనే ఒప్పుకున్నారు..
ఒక బిల్లును ప్రవేశపెట్టిన 12 గంటల్లోపే సవరణలు ఇవ్వాలని చైర్మనే చెబుతారు.. సెలెక్ట్ కమిటీకి పంపాలన్న సవరణ విషయంలో ఆ గడువు ల్యాప్స్ అయిందని కూడా ఆయనే ఒప్పుకున్నారు. ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి.. రూల్ పరంగా ప్రైవేటు ప్రతిపాదనను తీసుకోడానికి వీల్లేదన్న మంత్రుల వాదనతోనూ తాను ఏకీభవిస్తున్నానని, దీనికి బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా అనుకూలంగా ఉన్నారని కూడా చైర్మన్ చెప్పారు. ఇన్నీ చెప్పి.. చివరికి మాత్రం.. విచక్షణాధికారాలను(రూల్ 154 ప్రకారం) బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంటే చైర్మన్ తన విచక్షణాధికారాల్ని చట్టఉల్లంఘనకే వాడానని తానే చెప్పకనే చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానమేనా? అని ఆలోచించుకోవాలి.
అసలు మండలి అవసరమా?
అప్పట్లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ అసెంబ్లీలో.. శాసన మండళ్ల ఏర్పాటుపై పెద్ద చర్చే జరిగింది. రాష్ట్రాల్లో అసెంబ్లీ కాకుండా రెండో సభ అవసరంలేదని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇవాళ దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం 6 చోట్ల మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి. దాని నిర్వహణకు రోజుకు కోటి రూపాయాలు ఖర్చవుతుంది. ఏడాదికి కలిపి 60 కోట్లు ఖర్చవుతోంది. విభజనతో పేద రాష్ట్రంగా మారిన ఏపీకి మండలి అవసరమా? అసెంబ్లీలోనే పీహెచ్ డీ చేసినవాళ్ల నుంచి రైతుల దాకా అన్ని రంగాల మేధావులున్నారు.
నిర్ణయం సోమవారానికి వాయిదా
చంద్రబాబు తనకు సంబంధంలేని మండలిలో కూర్చొని ఎలాంటి ఆదేశాలిచ్చారో మనందరం చూశాం. చట్టసభ చట్టం ప్రకారం నడుస్తోందా? ఒక వ్యక్తి, ఆయన పార్టీ ఇష్టాను సారం నడుస్తోందా? అనేది మనం చూశాం. అసలు శాసన మండలి అనేది ప్రజా ప్రభుత్వం కోరుకున్నట్లు నడుస్తోందా లేక ఓడిపోయిన నాయకుడి ప్రయోజనాల కోసం నడుస్తోందా అన్నది అందరూ చూస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తూ, రాజకీయ అజెండాతో నడుస్తోన్న మండలిని కొనసాగించాలా? లేదా? అన్నది సీరియస్ గా ఆలోచించాలి. భ్రష్టుపట్టిన వ్యవస్థను క్లీన్ చేయడానికి అందరి సహకారం కావాలి. మండలిని రద్దు రద్దు చేసే అంశంపై అసెంబ్లలో సోమవారం సుదీర్ఘంగా చర్చించి, ఒక నిర్ణయం తీసుకుందాం''అని సీఎం జగన్ చెప్పారు. ఆ వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం సభను సోమవారానికి వాయిదావేశారు.