పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభించిన ఏపీ సీఎం : పసుపు ముఖాలు ఎర్రగా మారాయన్న వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ సొంత ఇల్లు లేని నిరుపేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Recommended Video
పదిహేను రోజులపాటు పండగలా ఇళ్ల పట్టాల పంపిణీ
175 నియోజకవర్గాల్లో నేటి నుండి పదిహేను రోజులపాటు పండగలా ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా అక్కాచెల్లెళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లుగా పేర్కొన్న జగన్ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ రెండు పర్వదినాలు ఒకే రోజు వచ్చిన నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణం చేపట్టనున్నారు. రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసి ఇస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వం మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం చేపడితే.. ఈ ప్రభుత్వం గ్రామాలనే నిర్మిస్తోంది
ఈ ఇళ్ల నిర్మాణం వల్ల కోటి 24 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని జగన్ వ్యాఖ్యానించారు . గత ప్రభుత్వం మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం చేపడితే ఈ ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మిస్తోంది అని, ఇళ్లను కాదు ఊర్లను కడుతున్నామని జగన్ గట్టిగా చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో యు కొత్తపల్లి మండలం కొమరగిరి లో వైయస్సార్ జగన్ అన్న కాలనీలో మోడల్ హౌస్ ను పరిశీలించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పైలాన్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
పట్టాల పంపిణీ అడ్డుకోవటం కోసం చంద్రబాబు , టీడీపీ నేతల కోర్టు కేసులు
దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 30 లక్షల ఇళ్ల పట్టాలను మహిళలకు ఇస్తున్నానని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే, దానిని అడ్డుకోవడం కోసం చంద్రబాబు ఆయన అనుచరులు , టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదల కోసం సుప్రీంకోర్టులో పోరాడి అయినా సరే అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు .
పేదలకు మేలు జరుగుతుంటే పసుపు పార్టీ నాయకుల ముఖాలు ఎరుపు రంగుకు
టిడిపి నేతల పిటిషన్ల వల్ల 10 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయిందని త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామన్నారు వైయస్ జగన్ . ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడ్డానికి రాజకీయ దురుద్దేశాలు కారణమని పేదలకు మేలు జరుగుతుంటే పసుపు పార్టీ నాయకుల ముఖాలు ఎరుపు రంగుకు మారుతున్నాయి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇంటి స్థలం ఇవ్వడమే కాదు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని కొత్తగా 17 వేల వైయస్సార్ జగనన్న కాలనీలు రాబోతున్నాయని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ అద్భుతంగా రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు.