వైసీపీ నేతలపై సీఎం జగన్ ఫైర్.. టీడీపీ ఎమ్మెల్సీల చీలికపై చురకలు.. మండలి రద్దుపై క్లారిటీ
మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధిచిన వికేంద్రీకరణ బిల్లుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దానికి అడ్డుగా ఉన్న శాసన మండలిని రద్దు చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన మండలి..ఇప్పుడు ప్రభుత్వానికే వ్యతిరేకంగా పనిచేయడం చట్ట విరుద్ధమని, అలాంటి వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకుందాం.. అంటూ గురువారం అసెంబ్లీలో చెప్పిన ఆయన.. ఆదివారం విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంలో, క్యాంప్ ఆఫీసులోనూ మండలి రద్దుపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
టీడీపీలో చీలిక ఖాయం..
శాసన మండలిని రద్దు చేయకుండానే వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు ఆమోదం పొందేలా ప్రయత్నిద్దామని ఆదివారం సీఎం జగన్ ను కలిసిన వైసీపీ కీలక నేతలు కొందరు మరోసారి సలహా ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీలో చీలిక ఖాయమైపోయిందని, మొత్తం ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్సీలు సోమవారం ఉదయానికల్లా వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారని ఆ నేతలు సీఎంకు వివరించినట్లు వార్తలు వచ్చాయి. మండలి రద్దుపై సొంత పార్టీలోనే ప్రత్యామ్నాయ వాదన బలపడుతుండటంతో దీనిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.
చంద్రబాబులా నన్ను మార్చకండి..
టీడీపీని చీల్చుదామంటూ సలహా ఇచ్చిన వైసీపీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘మండలిలో మనకు బలం లేదని నాకు ముందే తెలియదా? అయినాసరే బిల్లుల్ని ఎందుకు పంపామో ఇదివరకే చెప్పాను కదా? చట్టవిరుద్ధంగా వ్యవహరించింది కాబట్టే మండలి రద్దయ్యే పరిస్థితికొచ్చింది. అవసరాల కోసం పక్కపార్టీ వాళ్లను పశువుల్లాగా కొనే సంస్కృతి చంద్రబాబుది. మీ చెత్త సలహాలతో నన్ను కూడా ఆయనలా మార్చాలని ప్రయత్నించకండి''అని సీఎం ఘాటుగా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.
సస్పెన్స్కు తెరదించిన సీఎం
శాసన మండలి అవసరమా? అంటూ సుదీర్ఘ ప్రసంగం చేసిన తర్వాత కూడా రద్దుకు సంబంధించి అధికార ప్రకటన చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ ఆదివారం ఆ సస్పెన్స్ కు తెరదించుతూ మండలి రద్దు ఖాయమైపోయినట్లు దాదాపు వెల్లడించారు. ఆదివారం తనను కలిసిన నేతలకు ఆయనీ విషయం చెప్పినట్లు వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.
రేపు 9.30కు ముహుర్తం
శాసన మండలి రద్దుపై పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్.. అందుకోసం ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సోమవారం ఉదయం 9.30కి కేబినెట్ సమావేశం ఉంటుందని, మండలి రద్దు తీర్మానానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తుందని, ఆ వెంటనే దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆమోదింపజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గురువారంనాటి చర్చ.. మండలి రద్దు ప్రతిపాదనపైనేగానీ, రద్దు చేయాలన్న తీర్మానంపై కాదని, అందుకే సోమవారం తాజాగా ఆ మేరకు తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు.
కేంద్రం ఆరా.. స్పీకర్, చైర్మన్ తో గవర్నర్..
మండలి రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. కేంద్ర ప్రతినిధి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం మండలి చైర్మన్ షరీఫ్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంలను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. సభా వ్యవహారాలపై ప్రశ్నలడిగారు. ఒకవేళ మండలి రద్దు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినా.. దానికి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం తర్వాతే మండలి రద్దవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యూహాలపై బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.