మీరు చెప్పినవి సరిదిద్దుకుంటాం - సీఎం జగన్..!!
ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సీఎం జగన్..చంద్రబాబు..పవన్ ప్రచారం కొనసాగిస్తున్నారు. జగన్ ఎన్నికల ప్రచారంతో పాటుగా స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. పథకాలు..సమస్యల పైన ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో పలు కీలక అంశాలను ప్రస్తావన చేస్తున్నారు. తన పాలనలో అందిన సంక్షేమం గురించి వివరిస్తున్నారు. 58 నెలల కాలంలో ప్రతీ ఇంటికి మంచి చేసామని చెబుతున్నారు. తన పాలన పైన ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నారు.
పథకాల పై ఆరా
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. తుగ్గలిలో సీఎం జగన్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు ప్రజలు పలు వినతులు చేశారు. తమకు చేకూరిన లబ్ధి గురించి వివరించారు. స్థానికులు నుంచి సూచనలు, సలహాలు కోరారు. వాటిని ఖచ్చితంగా తాము పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

అవసరమైన చోట సరిదిద్దుకోవటానికి సిద్దంగా ఉన్నామని జగన్ స్పష్టం చేసారు. జూనియర్ కాలేజి తమ మండలంలో ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు కోరారు. నాడు - నేడు కింద ప్రతీ మండలంలో రెండు జూనియర్ ప్రభుత్వ కాలేజీలు వస్తున్నాయని..ఒక కాలేజీ పూర్తిగా విద్యార్ధినులకే ఉండేలా నిర్ణయం చేసామని వెల్లడించారు.
రూపు రేఖలు మార్చాం
మొట్టమొదటి సారిగా ప్రభుత్వ బడుల రూపు రేఖలను మార్చామని చెప్పారు. నాడు - నేడు కింది చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తెలుగు మీడియం పోయి ఇంగ్లీషు మీడియం తీసుకువచ్చామని జగన్ చెప్పారు. ఎనిమిదో తరగతి విద్యార్థి కి ట్యాబ్ లు ఇచ్చామన్నారు. ఆరో తరగతి ఆపై తరగతులకు చెందిన క్లాస్ రూమ్ లో డిజిటల్ బోధన పేద విద్యార్థులకు చేస్తున్నామని వివరించారు.
కార్పొరేట్లు కూడా ప్రభుత్వ స్కూల్స్ తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించాలని కోరారు. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ను తీసుకువచ్చి అనుసంధానం చేసామని ముఖ్యమంత్రి వివరించారు. ఆరోగ్య సురక్ష ప్రతీ ఆరు నెలలకో చేపట్టడంతో ప్రతీ ఇంటిని జల్లెడ పట్టి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నామన్నారు.
అండగా నిలవండి
ఆరోగ్య శ్రీ పరిధిని వెయ్యి ప్రొసీజర్ నుంచి 3,300 వరకు పెంచటంతో పాటుగా ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 25 లక్షలకు చేసిన అంశాన్ని వివరించారు. వ్యవసాయం, స్కూల్స్, వైద్యం అన్నీ గ్రామ పరిధిలో లంచాలు, వివక్ష లేకుండా సరికొత్తగా అందిస్తున్నామన్నారు.. గతానికి భిన్నంగా ఇలాంటి మార్పులు, పరిస్థితులను తీసుకువచ్చామని చెప్పారు. ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరమని వివరించారు. ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేదాని కోసం కాదని చెప్పారు.
జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం కోసం ఓటు వేయాలి, మార్పులు కొనసాగితేేనే పేదల తలరాతులు మారుతాయన్నారు. పేద వాడి బ్రతుకులు కూడా మారుతాయని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తాను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉందని నమ్మితే..తనకు మద్దతుగా నిలవాలని జగన్ కోరారు.












Click it and Unblock the Notifications