జగన్ సరికొత్త వ్యూహం: దక్షిణాదిన అందరివాడుగా...కీ రోల్ కోసమా : వారికి ఎందుకీ ప్రాధాన్యత అంటే.
ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సఖ్యతగా ఉంటూనే భవి ష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది ముఖ్యమంత్రుతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. అందులో భాగంగా దక్షిణాదిలో కీలకమైన తెలంగాణ..తమిళనాడు ముఖ్యమంత్రులకు మిత్రుడుగా ఉన్నారు. అదే సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని తన నివాసానికి ఆహ్వానించారు. ఎంపీల సమావేశంలో జగన్ తన వ్యూహం ఏంటో స్పష్టం చేసారు. ఇంతకీ జగన్ వ్యూహం ఏంటి...ఎందుకీ కొత్త బంధాలు..
హోదా కాదు..స్పెషల్ ఫోకస్ స్టేట్: జగన్ ఒప్పుకోవాల్సిందేనా: చంద్రబాబు చేతికి అస్త్రం అందిస్తారా
ప్రధానితో సఖ్యతగా ఉండాల్సిందే...
ఏపీ ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రమాణ స్వీకారానికి ముందే జగన్ వెళ్లి తొలుత కలిసింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఆ తరువాత ప్రధాని మోదీ. ఆ ఇద్దరూ కూడా జగన్కు పలికిన స్వాగతం చూసి వైసీపీ నేతలే ఆశ్చర్య పోయారు . ప్రధాని మోదీ..అమిత్ షాతో సమావేశం తరువాత ఢిల్లీలో మీడియా సమావేశంలోనే జగన్ తన వైఖరి స్పష్టం చేసారు. పూర్తి మెజార్టీతో ఉన్న కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని..వారితో సఖ్యతగా ఉంటూ హోదాతో సహా ఇతర హామీలు సాధించటం మినహా మరే విధంగానూ ఒత్తిడి చేయలేమని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసారు. ఇక, ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సాయం లేకుండా తాను ఏమీ చేయలేననే నిర్ణయానికి జగన్ వచ్చేసారు. అందులో భాగంగానే తన వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే..ప్రధాని సహకరించాల్సిందే అనే ఉద్దేశం తో తిరుపతి విమానాశ్రయంలో ఏకంగా ప్రధానికి పాదాభివందన ప్రయత్నం చేసారు.
పొరుగు ముఖ్యమంత్రులతో..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ప్రధాని మోదీతో సఖ్యతగా లేని కారణంగా టీడీపీ రాజకీయంగా నష్టపోవటం కాకుండా.. ఏపీకీ నష్టం జరిగిందనేది జగన్ అభిప్రాయం. దీంతో..తాను మాత్రం అటు కేంద్రం.. ఇటు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సఖ్యతగా ఉంటూ ఏపీ ప్రయోజనాల కోసం పని చేస్తానని జగన్ తన పార్టీ ఎంపీల సమావేశంలోనూ స్పష్టం చేసారు. అందులో భాగంగానే..కేంద్ర ప్రభుత్వంతోనూ సన్నిహితంగా ఉండాలని ఎంపీలకు నిర్ధేశించారు. ఇక, తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్..స్టాలిన్లను ఆహ్వానించిన జగన్ ఈ రోజు ఢిల్లీలో తన నివసానికి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని ఆహ్వానించారు. ఏపీ- కర్నాటక మధ్య ఉన్న నీటి వివాదాలు..ఇతర సమస్యల పైన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. కాంగ్రెస్ మద్దతుతో కొనసాగుతున్నా..పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు.
దక్షిణాదిన అందరి మద్దతు కోసమా
పార్లమెంట్లో ఇప్పుడు సంఖ్యా పరంగా చూస్తే మూడో స్థానంలో డీఎంకే..నాలుగో స్థానంలో వైసీపీ ఉన్నాయి. బీజేపీకి డిఎంకే వ్యతిరేకంగా ఉంది. వైసీపీ సన్నిహితంగా ఉంటుంది. అటు కేంద్రంతో జగన్ సఖ్యతగానే ఉంటున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితో జగన్ ఇప్పటికే మంచి సంబంధాలు సాగిస్తున్నారు. ఇక, రానున్న రోజుల్లో ఒడిశా సీఎం తోనూ జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీకీ ప్రత్యేక హోదా విషయంలో తమిళనాడు..తెలంగాణ..ఒడిశా మాత్రమే గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసాయి. ఇప్పుడు వారితో కలిసి ఉండటం ద్వారా హోదాకు అడ్డు లేకపోగా కేంద్రం పైన ఒత్తిడి పెంచటానికి వారి సహకారం మేలు చేస్తుందని ఆలోచిస్తున్న జగన్.. భవిష్యత్ ప్రయోజనాల కోసం వారికి పార్టీలకు అతీతంగా స్నేహ హస్తం అందిస్తున్నారు.