సభలో సీఎం తొలి ప్రకటన..తీర్మానం: జగన్ ఏం చెప్పబోతున్నారు: చంద్రబాబు చేతికి అస్త్రం..!
ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి ప్రకటన చేయబోతున్నారు. అదే ప్రకటన పైన అధికారికంగా ప్రభుత్వ తీర్మానం చేయనున్నారు. గతంలో ఇదే అంశం పైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు శాసనసభలో అనేక ప్రకటన లు..తీర్మానాలు చేయగా..విపక్ష నేతగా జగన్ తప్పు బట్టారు. ఆ తీర్మానాలకు మద్దతు ఇస్తూనే.. చంద్రబాబు వైఫల్యంగా ఆరోపణలు చేసారు. మరి..ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు. జగన్ చెప్పే అంశాలకు మద్దతు ఇస్తారా.. లేక జగన్ ను కార్నర్ చేస్తారా..ఏం జరగబోతోంది..
సభలో నేడు జగన్ ప్రకటన...
ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన సీఎం ప్రకటన చేస్తారు. ఆ తరువాత ఇదే అంశం పైన స్వల్ప కాలిక చర్చ..తీర్మానం ఉండనుంది. ఏపీకీ ప్రత్యేక హోదా కోసం విపక్షనేతగా ఉన్న సమయంలో జగన్ అనేక రకాలుగా నిరసలు..దీక్షలు చేసారు. ఇక, ఎన్నికల ప్రచారంలోనూ హోదా పైనా ప్రజలకు వివరించారు. హోదా ఇస్తూ నిర్ణయం తీసుకున్న వారికే తమ ఎంపీల మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. ఇక, ఎన్నికలల్లో గెలిచి ఢిల్లీ వెళ్లిన జగన్ అక్కడ మోదీతో సమావేశం తరువాత ఇప్పుడు కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటైందని...వారితో సఖ్యతగా ఉంటూ హోదాను తెచ్చుకోవటం మినహా ఒత్తిడితో సాధించేదీ ఏమీ లేదని స్పష్టం చేసారు. ఇక, ముఖ్యమంత్రి అయిన తరువాత ఇదే విషయం పైన హోం మంత్రి అమిత్ షాను కలవటంతో పాటుగా..నీతి అయోగ్ సమావేశంలోనూ గట్టిగానే ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే అంశం పైన శాసనసభలో జగన్ ప్రకటన చేయనున్నారు. ఆ వెంటనే తీర్మానం ప్రతిపాదిస్తారు.
గతంలో చంద్రబాబు ఇదే తరహాలో..
గతంలో అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా పైన అనేక సార్లు సభలో స్టేట్మెంట్లు..తీర్మానాలు చేసారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ నాటి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు రాకుండా తీర్మానాలు చేస్తే ప్రయోజనం ఏంటంటూ ఒత్తిడి పెంచారు. ఆ తరువాత ప్యాకేజీకి చంద్రబాబు ఓకే చెప్పిన తరువాత ఆ నిర్ణయం పైన జగన్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. దీంతో..జగన్ ఒత్తిడితో రాజకీయంగా వెనుకబడ కూడదనే కారణంతో ఎట్టకేలకు చంద్రబాబు నాడు కేంద్రం నుడి తన మంత్రులను ఉప సంహరించుకున్నారు. ఆ వెంటనే ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. ఇక, కేంద్రం మాత్రం ఇప్పటికీ హోదా పైన స్పష్టత ఇవ్వటం లేదు. హోదా ముగిసిన అధ్యాయం అంటూ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ ముఖ్యమంత్రి హోదాలో సభలో తీర్మానం ప్రతిపాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవటం..ప్రతీ సమావేశంలో తీర్మానం చేయటం..కేంద్రంతో సంప్రదింపులు తప్పవని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేసారు.
చంద్రబాబు చేతికి అస్త్రంగా మారేనా..
ఇక, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి ప్రత్యేక హోదా పైన తీర్మానం చేయటం..కేంద్రానికి పంపటం చేయటం ద్వారా రాజకీయంగా విపక్ష నేత చంద్రబాబుకు చేతికి అస్త్రం అందించినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు తీరు కారణంగానే హోదా రాలేదని గతంలో ఆరోపించిన జగన్..ఇప్పుడు తన హయాంలో సైతం నాడు చంద్రబాబు వ్యవహరించిన విధంగానే ఇప్పుడూ సభలో తీర్మానాలు చేయటం పైన టీడీపీ ప్రశ్నించే అవకాశం ఉంది. టీడీపీ జగన్ ప్రతిపాదించే తీర్మానానికి మద్దతు ఇస్తూనే..గతంలో జగన్ లేవనెత్తిన అంశాలను.. చేసిన విమర్శలను ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే..జగన్ వీటికి ఎలా సమాధానం చెబుతారు.. ప్రధాని మోదీ.. అమిత్ షాతో చర్చల సమయంలో వారి నుండి ఎటువంటి స్పందన వ్యక్తం అయిందీ..భవిష్యత్లో హోదా గురించి ఏ రకంగా వ్యవహరించబోయేదీ జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.