హోదా విషయంలో తగ్గేది లేదు! ప్రధానిని మీరే ఒప్పించాలి: అమిత్ షాకు జగన్ విజ్ఞప్తి
ఏపీకీ ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా ప్రధానిని ఒప్పించటానికి సహకరించండి అంటూ కేంద్ర హోం మంత్రి..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇప్పటి వరకు అమలు కాని అంశాలను జగన్ హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న అపరిష్కృత అంశాల పైన ముఖ్యమంత్రులిద్దరం చర్చించి పరిష్కరించుకుంటున్నామని..ప్రధానంగా పెండింగ్ హామీలు..నిధులు విడుదల చేయాలని జగన్ కోరారు. దీనికి అమిత్ షా సైతం సానుకూలంగా స్పందించారని సమాచారం.
ప్రధానికి మీ మాటగా చెప్పండి..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పార్టీ ఎంపీలతో కలిసి దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఏపీలో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులు..ఆర్దిక సమస్యల గురించి జగన్ వివరించారు. అదే సమయంలో ఏపీకి రాజ్యసభ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా పైనా షాకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో వివరిస్తూ సిద్దం చేసిన ఒక నివేదికను ఆయనకు అందచేసారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా ప్రధానిని ఒప్పించేందుకు మీరు చొరవ తీసుకో వాలని సీఎం జగన్ కేంద్ర హోం మంత్రిని అభ్యర్దించారు. కడపలో స్టీల్ ప్లాంట్..పెట్రోలియం కారిడార్.. ఇప్పటికే మంజూరు చేసిన విశ్వవిద్యాలయాలకు నిధుల మంజూరు చేయాలని జగన్ కోరారు. ప్రధానంగా రెవిన్యూ లోటు పూర్తి స్థాయిలో భర్తీ చేయని కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
సానుకూలంగా స్పందించిన షా..
ఏపీ సీఎం జగన్ వివరించిన అంశాలను సానుకూలంగా విన్న హోం మంత్రి అమిత్ షా తక్షణం దృష్టి సారించాల్సిన అంశాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఏపీకీ అండగా నిలుస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేయగా..కేంద్రం ఏపీకి ఇప్పటికే అనేక పదకాల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిందని షా వివరించారు. ఇదే విధంగా భవిష్యత్లోనూ తమ సహకారం ఉంటుందని షా హామీ ఇచ్చారు. అదే సమయంలో.. ఆర్దిక ఇబ్బందుల పైనా అమిత్ షా మరింత సమాచారం సేకరించారు. త్వరలోనే ఈ సమస్యల పైన అధికారులతో చర్చిస్తామని.. ఇతర కేంద్ర మంత్రుల పరిధిలో ఉన్న అంశాలను వారితో చర్చించి ఏపీకీ సాయం అందించేలా చూస్తానని హామీ ఇచ్చిన ట్లుగా తెలుస్తోంది. పునర్విభజన చట్టం అమలుకు కేంద్ర హోం శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ మరోసారి కోరారు.
నీతి అయోగ్లోనూ ప్రస్తావిస్తా..
శనివారం ఢిల్లీలో జరిగి నీతి అయోగ్ సమావేశంలోనూ ఏపీ సమస్యలను ప్రస్తావిస్తానని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేసారు . ఏపీకీ ప్రత్యేక హోదా అంశం పైన అమిత్ షాతో చర్చించామని..అదే విధంగా నీతి అయోగ్ సమావేశంలోనూ దీని పైనే ప్రధానంగా ప్రస్తావించి..ఏపీకీ హోదా ఎందుకు అవసరమో అంకెలు..వాస్తవ పరిస్థితులతో సహా వివరిస్తానని జగన్ వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ తాను ప్రధానిని అడుగుతూనే ఉంటానని స్పష్టం చేసారు. అదే సమయంలో లోక్సభలో వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసారనే వార్తల పైనా జగన్ స్పందించారు. ఇవన్నీ ఊహాగానాలే అంటూ..అటువంటి ప్రతిపాదన తమ వద్దకు రాలేదని స్పష్టం చేసారు. నీతి అయోగ్ సమావేశం కోసమే తాను ప్రధానంగా ఢిల్లీ వచ్చానని..రాష్ట్ర విభజన హామీలు పెండింగ్ ఉండటంతో వాటి పరిష్కారం కోసమే కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసానని జగన్ స్పష్టం చేసారు.