గాంధీ జయంతి నాడు గిరిజన సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ అడుగులు .. గిరిజనుల జీవితాల్లో వెలుగులు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గిరిజనుల దశాబ్దాల కల సాకారం చేశారు .ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి గాంధీ జయంతి రోజున గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Recommended Video
గిరిజనులకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం ..రైతు భరోసా కేంద్రాల్లో గిరిజన ఉత్పత్తుల అమ్మకం
ఆన్ లైన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
కురుపాం లో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, పాడేరు లో మెడికల్ కాలేజ్, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లకు ఆన్లైన్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకువచ్చామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు, గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
లక్ష 53 వేల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమి పంపిణీ పట్టాలు
రాష్ట్రంలో లక్ష 53 వేల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేస్తున్నామని, రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలిపారు. ఏళ్ళ తరబడి పోదు భూములపై హక్కులు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి పట్టాలిస్తున్నామని చెప్పారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.గిరిజనులు పంట పండించడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వానికి తోడ్పాటు అందుతుందని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని తాను భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో సమానంగా భావిస్తానని, తూచా తప్పకుండా అమలు చేస్తానని ఆయన మరోమారు స్పష్టం చేశారు.
పాడేరులో మెడికల్ కాలేజ్ , కురుపాం లో గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్
టిడిపి హయాంలో గిరిజనులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, గిరిజన సలహా మండలి ఏర్పాటు కూడా ఆలోచన చేయలేదని పేర్కొన్న జగన్ , పాదయాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు చూశానని, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారని పేర్కొన్నారు.పాడేరు లో ఐదు వందల కోట్ల రూపాయలతో వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టామని, కురుపాం లో 153 కోట్ల రూపాయలతో గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి .
గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
బుట్టాయిగూడెం, దోర్నాల, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రభుత్వం 246.30 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేసి వారిని కూడా ముందుకు తీసుకురావడానికి అన్ని సంక్షేమ పథకాలను వారికి అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్నలక్షల మందికి నేడు పట్టాలిచ్చి వారి ముఖంలో ఆనందం చూశారు సీఎం జగన్ . గాంధీ జయంతి రోజున గిరిజన సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాల్ని మంత్రులు కొనియాడుతున్నారు .