జగన్ కొత్త ఎత్తుగడ: ఎన్నికల కమిషనర్ గా రామ సుందరరెడ్డి: ఇక.. ముగ్గురు సభ్యులతో..వ్యూహాత్మకంగా!!
అమరావతి: కరోనా పైన చర్యలు తీసుకుంటూనే..ఊహించని విధంగా ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం కరోనా ఆందోళనతో ఉన్న సమయంలో..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..ఆయన స్థానంలో ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శికి కమిషనర్ గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో..ఇప్పటి వరకు ఏక సభ్య కమిషన్ గా ఉన్న ఏపీ ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య కమిషన్గా మారుస్తూ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ లో పొందుపర్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఎన్నికల సంస్కరణలో బాగంగా ప్రభుత్వం చెబుతుంటే..రాజకీయంగా మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, న్యాయ పరంగా ఎదురయ్యే అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. జీవోల జారీ..కొత్త కమిషనర్ నియామకం అంతా సమయం చూసి వ్యవహరించినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
కొత్త కమిషనర్ గా రామ సుందరరెడ్డి...
ఏపీ ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ గా ప్రస్తుతం ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి రామ సుందర రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఎన్నికల సంఘంలో మార్పుల పైన ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయాలు అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ప్రతీ విషయాన్ని గోప్యంగా ఉంచింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో అర్హతలు..వారి పదవీ కాలం వంటి విషయాల్లో మార్పులు చేస్తూ తెచ్చిన ఆర్దినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది. ఆ వెంటనే ప్రభుత్వం దీనిని ఉత్తర్వులుగా అమల్లోకి తెచ్చింది. ఆ వెంటనే రమేష్ కుమార్ పదవీ కాలం మూడేళ్లు ముగియటంతో తాము తెచ్చిన ఆర్డినెన్స్ మేరకు ఇక పదవిలో నిమ్మగడ్డ కొనసాగటానికి వీళ్లేకుండా చేసింది. ఈ మేరకు రమేష్ కుమార్ కు ఉద్వాసన పలుకుతూ మరో జీవో జారీ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.
ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా రామసుందర రెడ్డి
రమేష్ కుమార్ను వ్యూహాత్మకంగా తప్పించిన జగన్ సర్కార్... ప్రస్తుతం ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న రామసుందర రెడ్డిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నియామకం పైనా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మూడు రహస్య జీవోలను జారీ చేసింది. రామ సుందరరెడ్డి గతంలో తుడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సమయంలో.. ఈ ఏడాది జనవరి 13న.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా జగన్ ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు ఆయనకే కమిషనర్ గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇక ముగ్గురు సభ్యులతో కమిషన్..
ఇక, ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆర్డినెన్స్ లో కొత్త మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా..ఇప్పటి వరకు కమిషనర్ ఒక్కరే ఉండే రాష్ట్ర ఎన్నికల సంఘం లో ఇక నుండి ముగ్గురు సభ్యులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తరహాలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉండనుంది. కమిషన్ లో ముగ్గురు సభ్యులు ఉండటం ద్వారా పారదర్శకం గా నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక, తమతో సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయటం ప్రతిష్ఠాత్మకంగా భావించిన ప్రభుత్వం అనూహ్యంగా సమయం చూసి దెబ్బ కొట్టింది.
వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రభుత్వం.?
కరోనా పైనే దేశం మొత్తం ఫోకస్ చేసిన సమయంలో అకస్మికంగా ఎన్నికల కమిషన్ విషయంలో మార్పులు..నిమ్మగడ్డ తొలిగింపు..కొత్త కమిషనర్ నియామకం పైన రహస్య జీవోలు జారీ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో..నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం పైన న్యాయ పోరాటం చేసినా..న్యాయ స్థానంలో తీర్పు ఎలా ఉన్నా..ముగ్గురు సభ్యులను నియమించటం ద్వారా ముందస్తుగా ప్రభుత్వం అన్ని అవకాశాలను పరిగణలోకి తీసుకొని ..వ్యూహాత్మకంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.