సీబీఐ కోర్టుకు హాజరు కాని సీఎం జగన్.. కారణం ఇదే .. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ !!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . నేడు కోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉన్నా ఆయన హాజరు కాలేదు . అక్రమాస్తుల కేసులో కోర్టుకు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు జగన్ కు చాలా స్పష్టంగా చెప్పినా ఈరోజు మాత్రం ఆయన కోర్టుకు వెళ్ళలేదు . దీంతో కోర్టు తదుపరి నిర్ణయం ఏమిటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
వ్యక్తిగత హాజరు మినహాయింపుకు హైకోర్టులో జగన్ పిటీషన్
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కోర్టుకు హాజరు కావటానికి ఇష్టపడటం లేదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉంటున్నందున కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఇప్పటికి రెండుసార్లు జగన్ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు వాటిని తిరస్కరించింది . ఇక సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు జగన్ .
Recommended Video
ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు చేసి రాజన్ చెప్పిన జగన్ తరపు న్యాయవాదులు
జగన్ తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చెయ్యటంతో ఈ పిటిషన్ను విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్నందునే జగన్ కోర్టుకు హాజరు కాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ నేపధ్యంలో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో నేడు ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు చేశారు.
సీబీఐ కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో ?
జగన్ మోహన్ రెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు ముఖ్యమంత్రి చాలా ముఖ్యమైన అధికారిక కార్యకలాపాలలో బిజీగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు. వ్యక్తిగత మినహాయింపుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని వారు సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరి సీబీఐ కోర్టు ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి .