సీఎం జగన్ వైఎస్ఆర్ను కొట్టలేదు, పిల్లనిచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: అంబటి
Recommended Video
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనమండలి రద్దు చేసే చర్చలో పాల్గొనని చంద్రబాబు నాయుడు పిచ్చి సవాళ్లు విసురుతున్నాని మండిపడ్డారు. కీలకమైన చట్టాలను శాసనసభ చేస్తోంటే మండలిలో అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో మండలిలు లేవని గుర్తుచేశారు. 2004లో చంద్రబాబు నాయుడు మండలిని వద్దని ఇప్పుడు.. మండలిపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు.
ఎందుకు దూరం..
మండలి రద్దుపై శాసనసభలో చర్చ జరుగుతుంటే టీడీపీ, చంద్రబాబు నాయుడు ఎందుకు పాల్గొనలేదని అంబటి రాంబాబ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓ రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పాలే కానీ సభకు రాకుండా ఉండటం మంచి పద్ధతి కాదన్నారు. చారిత్రాత్మక ఘట్టానికి చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నారని విమర్శించారు. డార్క్ రూంలో ఉండి, తన గొంతును శాసనసభ రికార్డులోకి రానీయలేదన్నారు.
ఎందుకు రద్దుచేయాలి..?
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దిగువ, ఎగువ సభలు రెండు ఉంటాయి. అయితే పరిమితి మిచి నడుచుకోవడం వల్లే వికటించడం ప్రారంభమవుతోందని చెప్పారు. అభివృద్ధి కోసం రాజధాని వికేంద్రీకరణ చేపడితే.. మండలిలో అడ్డుకోవడం ఏంటీ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. శాసనమండలి కాదు రద్దు చేయాల్సింది శాసనసభ అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులవుతోంది అని అడిగారు.
మీరు రాజీనామా చేయండి
తమ పార్టీ అధికారం చేపట్టి 8 నెలలవుతోందని.. అప్పుడే రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. ప్రజల తీర్పుపై నమ్మకం ఉంటే మీ 23 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని మార్పు కోసం రాజీనామా చేసి పోటీ చేస్తున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అప్పుడు మీ బండారం బయటపడుతోందన్నారు. పిచ్చి సవాల్ విసిరి రాజకీయాలు మానుకొంటానని చంద్రబాబు చెప్తున్నారు. అప్పుడు కాదు మీరు ఇప్పుడు రాజకీయాలు మానుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
కారణమిదే..?
చంద్రబాబు నాయుడుకి నిన్నటి మీడియా సమావేశంలో ఎందుకంత ఆవేశానికి గురయ్యాడో అసలు కారణం వివరించారు అంబటి రాంబాబు. నాడు-నేడు అన్నట్టు మోడీతో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు, మండలి పున:నియామకంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో వీడియో క్లిప్పింగులు ప్రదర్శించారని గుర్తుచేశారు. ఆ క్లిప్పింగులు చూసి చంద్రబాబు నాయుడికి మతిభ్రమించిందని చెప్పారు. దీంతో చంద్రబాబు లాంటి యూ టర్న్ తీసుకునే నేత దేశంలోనే లేడని అర్థమవుతోందన్నారు.
వెన్నుపోటు పొడిచి
పిల్లనిచ్చి మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఫైరయ్యారు. సీఎం జగన్.. వైఎస్ఆర్ను కొట్టాడని.. విజయమ్మ రోశయ్యతో చెప్పాడని కళ్లబొల్లి కబుర్లు చెప్తున్నారని ఫైరయ్యారు. మీరు మాట్లాడితే చూపించే ఎల్లో మీడియా ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.