సీఎం జగన్ అలర్ట్ : పవన్ హ్యాపీస్ - చంద్రబాబు కోరుకున్నట్లే..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టు. ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కు తాజా పరిణామాలు హ్యాపీనిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. తాను 2019 లో అమలు చేసిన ప్లాన్..ఇప్పుడు చంద్రబాబు రివర్స్ లో తన మీద ప్రయోగిస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తుండటంతో సీఎం జగన్ కౌంటర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో కొత్త సమీకరణాలు
నాలుగేళ్లుగా ప్రధాని మోదీ - టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య పలకరింపులు లేవు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలి. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు. కేంద్రం నుంచి సహకారం ఉండకూడదు. ఈ మూడు లక్ష్యాలతో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. ముందుగా ప్రధానితో కలిసేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. అందు కోసం రాష్ట్రపతి ఎన్నికల్లో కోరకపోయినా మద్దతు ఇచ్చి తొలి అడుగు వేసారు. దీనికి కొనసాగింపుగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారు. కేంద్రం నుంచి ఆహ్వానం అందటంతోనే ప్రధాని సమావేశం కావటంతో.. ఢిల్లీ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని పలకరింపులు "రాజకీయంగా" సద్వినియోగం చేసుకొనే ప్రయత్నాలు చేసారు. కోరుకున్న విధంగా ప్రధాని - చంద్రబాబు పలకరింపులకు ప్రాధాన్యత దక్కింది.
మరోసారి ఢిల్లీకి సీఎం - చంద్రబాబు
త్వరలోనే మరోసారి ప్రధాని తో భేటీ అయ్యేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారని సమాచారం. ఇక, ఎలాగైనా టీడీపీ - బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలనేది పవన్ లక్ష్యం. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నుంచి టీడీపీతో కలిసేందుకు సానుకూల వాతావరణం కనిపించ లేదు. కానీ, ప్రధాని - చంద్రబాబు పలకరింపులతో తన వ్యూహంలో తొలి అడుగు పడినట్లుగా జనసేనాని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి ముందుకు తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు పైనే ఉందనేది జనసేన నేతల వాదన. చంద్రబాబు తాను అంచనా వేసినట్లే..కోరుకున్న విధంగానే భవిష్యత్ రాజకీయం ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక, దీనిని ముందుగానే జగన్ పసి గట్టారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు.
మద్దతు - మైండ్ గేమ్
ప్రధానితో వ్యక్తిగతంగా కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు. ఈ వారాంతంలో సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ పర్యటనలో ఏపీలో బీజేపీ రాజకీయ అడుగుల పైన ప్రధాని - అమిత్ షా తో చర్చల సమయంలో క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రాజకీయ అడుగులు వేసే అవకాశం ఉంది. ఇక, ప్రధాని - చంద్రబాబు పలకరింపుల పైన వైసీపీ నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. సమావేశానికి హాజరైన ప్రతీ ఒక్కరినీ పలకరించే క్రమంలోనే చంద్రబాబుతోనూ ప్రధాని పలకరింపులు - కుశల ప్రశ్నలు వేశారని..దీని ఆధారంగా చంద్రబాబుకు ప్రత్యేకంగా ప్రధాని ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదనేది వారి వాదన. దీంతో.. సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనల ద్వారా ఎవరు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొనేదీ..ఎవరి జట్టు ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.