ఇక..ప్రజల్లోకి సీఎం జగన్: పధకాలు..పాలనపైన ఆరా: ముహూర్తం ఖరారు..!
తన పాలన మీద ప్రజా నాడి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా.. ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గ్రామ బాట పట్టాలని...నేరుగా గ్రామ ప్రజలతో మమేకం కావాలని డిసైడ్ అయ్యారు. గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖరారు చేసి..ప్రారంభానికి వెళ్తున్న సమయంలోనే హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై మరణించారు.
కానీ, ఇప్పుడు ఆ తరుహాలోనే ముందుగా గ్రామాల ప్రజల వద్దకు వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా గిరిజన గ్రామాల నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ప్రభుత్వ పధకాలతో పాటుగా పాలనా తీరు తెన్నుల పైన నేరుగా ప్రజాభిప్రాయాన్ని సీఎం సేకరిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడు బ్రేక్ పడినా..త్వరలోనే నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీంతో..అటు రాజకీయంగా..ఇటు అధికారపరంగా ప్రజలతో మరింత దగ్గరయ్యేలా ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్ గ్రామబాట..
చాలా రోజులుగా ప్రజల మధ్యకు వెళ్లాలనే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన ఇప్పుడు ఆచరణ రూపంలో రానుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి గ్రామబాట పట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. వైయస్సార్ సీఎం గా రెండో సారి గెలిచిన తరువాత రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి..వారి సమస్యలు తెలుసుకోవటంతో పాటుగా పధకాల గురించి ఆరా తీయాలని భావించారు. అయితే, 2009 సెప్టెంబర్ 2న ఈ కార్యక్రమం అమలు కోసం చిత్తూరు జిల్లా కు వెళ్తూ..ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.
ఫిబ్రవరి రెండో వారం నుండి
దీంతో..జగన్ సీఎం అయిన సమయం నుండి తన తండ్రి ప్రారంభించాని భావించిన రచ్చబండను ప్రారంభించాలని భావించారు. అయినా..ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు. ఇక, ఫిబ్రవరి రెండో వారం నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే గ్రామాల బాట పట్టి..తన పాలన మీద నేరుగా ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. అందు కోసం ముందుగా ఉత్తరాంధ్రలోని గిరిజన గ్రామాల నుండి పర్యటన ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
పధకాలు..పాలన పైనే ఫోకస్..
ముఖ్యమంత్రి జగన్ ప్రజల మధ్యకు వెళ్లిన సమయంలో ప్రధానంగా గ్రామాల్లో మౌళిక వసతులను పరిశీలంచటంతో పాటుగా..గ్రామ సచివాలయలు..వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. అదే విధంగా ప్రజలతో మమేకం అయిన సందర్బంలో వారికి పధకాలు అందుతున్న తీరు.. పాలన పైన ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జరగనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయినా..కోర్టు తీర్పు కారణంగా వాయిదా పడ్డాయి.
ఈ పర్యటనల ద్వారా
అయితే, ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా న్యాయ సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలనే ఆలోచన లో ఉంది. దీంతో..ఈ పర్యటనల ద్వారా తన పాలన గురించి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది..అదే విధంగా పధకాలు ఏ రకంగా అందుతున్నాయనే అంశంతో పాటుగా చేపట్టాల్సిన మార్పులు..చేర్పుల గురించి సైతం ముఖ్యమంత్రి ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా గ్రామాలను ఎంపిక చేసుకొని పర్యటనలు చేయాలని సీఎం భావిస్తున్నారు. దీని పైన సీఎంఓ తుది కసరత్తు చేస్తోంది.