ఆ మంత్రులకే సీఎం బాధ్యతలు: ఇలా తిప్పి కొడదాం..: మండలిలో ప్రభుత్వం వ్యూహం ఇదే..!
Recommended Video
మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ బిల్లు శాసన మండలిలో ఏమవుతాయి. ప్రతిపక్షం సంఖ్య బలంతో అడ్డుకుంటుందా. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి పై చేయి సాధిస్తుందా. అసెంబ్లీలో సునాయాసం గా ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులు మండలిలో ఏమవుతాయనేది మాత్రం ఉత్కంఠకు కారణమవుతోంది. దీంతో..ప్రధాన ప్రతిపక్షం వ్యూహం ఏంటనే అంశం పైన ప్రభుత్వం ఆరా తీస్తోంది. టీడీపీతో సహా బీజేపీ వైఖరి ఏంటనేది ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రతిపక్షం ఏ విధంగా ముందుకొచ్చినా..బిల్లును అడ్డుకోవాలని భావించినా..ఏ విధంగా తిప్పుకొట్టాలనే దాని పైన ముఖ్యమంత్రి మంత్రులు..పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. మంత్రులను ఎంపిక చేసి వారికి బాధ్యత అప్పగించారు. ప్రతిపక్షాలకు ఉన్న ప్రతీ అవకాశం పైన అధ్యయనం చేసారు. ప్రతిగా ప్రతీ అంశానికి కౌంటర్ ప్లాన్ సిద్దం చేసుకున్నారు.
మూడు రాజధానులు తాత్కాలికమే: అమరావతే శాశ్వతం: ప్రభుత్వంపై పవన్ ఫైర్..!
ప్రతిపక్షానికి అవకాశం..కౌంటర్ ప్లాన్
అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను ఇప్పుడు శాసన మండలి ముందుకు తెస్తున్నారు. సభలో అధికార పక్షం కంటే టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి బిల్లును అడ్డుకొనేందుకు లేదా వ్యతిరేకించేందుకు ఉన్న అవకాశాల పైన నిపుణులతో సీఎం అర్ద్రరాత్రి వరకు చర్చించారు. అదే సమయంలో వారికి ఉన్న ప్రతీ అంశానికి కౌంటర్ గా ఏ రకంగా వ్యవహరించాలనే దాని పైన మంత్రులు..మండలి నేతలు ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు..డిప్యూటీ సీఎం బోస్ తో సహా మరి కొందరికి సూచనలు చేసారు. ఎలాగైనా బిల్లు మండలిలో ఆమోదం పొందేలా వ్యవహరించాలని నిర్దేశించారు. ప్రతిపక్షం సెలెక్ట్ కమిటీకి కోరినా.. బిల్లు వీగిపోయేలా డివిజన్ కోరినా..ఛైర్మన్ నిర్ణయం కీలకం కానుంది. దీంతో..ప్రభుత్వం అన్ని అంశాల మీద వ్యూహాలను సిద్దం చేసింది.
ఆ మంత్రులకు సీఎం బాధ్యతలు
మండలిలో ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొని..బిల్లులను గట్టెక్కించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు అప్పగించారు. మండలిలో రెండు బిల్లులను మంత్రులు బుగ్గన..బొత్సా ప్రవేశ పెడతారు. ఆ ఇద్దరు మంత్రులు చర్చ పూర్తయ్యే వరకూ మండలిలోనే ఉండాలని సీఎం నిర్దేశించారు. అదే సమయంలో మంత్రులు కొడాలి నాని..పేర్ని నాని..అనిల్ కుమార్ యాదవ్..రఘునాధ రాజు.. అవంతి శ్రీనివాస్.. మోపిదేవి వెంకట రమణ.. పుష్పశ్రీ వాణీ..కన్నబాబు లను సీఎం కొన్ని కీలక సూచనలు చేసారు. ప్రతిపక్షం నుండి ఎవరు ఈ బిల్లుల మీద మాట్లాడుతారు..ఏ అంశం మీద ఎవరు స్పందించాలి..ప్రతిపక్షాన్ని మండలిలో ఎలా నివారించాలనే అంశం పైన అధికార పక్షం వ్యూహం సిద్దం చేసింది. అయితే, మండలిలో జరిగే చర్చకు మంత్రి బుగ్గన సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బిల్లు పైన చివరకు ప్రతిపక్షం ఏ డిమాండ్ చేసే అవకాశం ఉందనే అంచనాలు వేస్తున్న ప్రభుత్వం..కౌంటర్ మార్గాలను సిద్దం చేస్తోంది.
ప్రభుత్వానికి ప్రతిష్ఠగా మారిన మండలి..
ప్రభుత్వం ఇప్పుడు మండలిలో మూడు రాజధానులు..సీఆర్డీఏ బిల్లును ఆమోదింప చేసుకోవటం ప్రతిష్ఠాత్మకంగా మారింది. శాసనసభలో ఆమోదించి..మండలిలో వీగిపోతే ప్రభుత్వం తిరిగి ఆ బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టి..నిర్ణయాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు. అందులో ముందస్తుగానే శాసనసభ ను బుధవారం వరకు కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అయితే, మండలిలో బిల్లులను నెగ్గించు కోలేక పోతే ప్రభుత్వ ప్రతిష్ఠకు ఇబ్బందిగా భావిస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అదే అంశం ప్రశ్నగా మారుతోంది. అయితే, తమ నిర్ణయానికి అడ్డు లేకుండా ప్రభుత్వం ముందుగానే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. మండలిలోనూ అదే తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఉంది. దీంతో..మొత్తంగా ఈ రెండు బిల్లుల పైన మండలిలో జరిగే పరిణామాల పైన ఉత్కంఠ నెలకొని ఉంది.