సీఎం జగన్ పులివెందుల పర్యటన వాయిదా.. నేడు కూడా ఢిల్లీ లోనే బిజీ బిజీగా జగన్
వైసీపీ అధినేత , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో బిజీగా ఉన్న సీఎం నేడు మరి కొందరు కేంద్ర ముఖ్యులతో సమావేశం కానున్నారు. దీంతో సీఎం జగన్ పులివెందుల, అనంతపురం పర్యటనలు రద్దయ్యాయి. ఢిల్లీలో కీలక నేతల్ని కలవాల్సి ఉన్నందున గురువారం పులివెందుల, అనంతపురం జిల్లాల్లో సీఎం పర్యటనలు ఉండబోవని కడప ఎంపీ అవినాష్రెడ్డి వెల్లడించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం ఉందని అన్నారు. రద్దయిన పర్యటనలు యధావిధిగా ఉంటాయని, వాటికి సంబంధించిన తేదీలు సీఎంవో అధికారులు త్వరలో వెల్లడిస్తారని చెప్పారు.
దేశంలోనే సీనియర్ ఏం చేస్తున్నారు..!! ప్రధాని..సీఎం సమావేశంలో ఆసక్తి కర చర్చ: జగన్
ఢిల్లీలో బిజీబిజీ భేటీలతో జగన్ .. కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్న జగన్
సీఎం జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ను కలిశారు. అలాగే రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ ను, ఉపరాష్ట్రపతి వెన్య నాయుడిని, నితిన్ గడ్కరీని కలిశారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఏపీ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా మీటింగ్స్లో పాల్గొంటున్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన జగన్ సుమారు 40 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు . రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయం అందివ్వాలని ఆయన కోరినట్లు సమాచారం.
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్రానికి ఆర్ధికంగా చేయూతనివ్వాలని కోరిన జగన్ .. నేడు పులివెందుల పర్యటన వాయిదా
అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెండింగ్లో ఉన్న రూ.5వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను సీఎం కోరారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న నవరత్నాల పథకాలకు ఆర్థిక సాయం అందించాలని జగన్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయిన సీఎం.. బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నితిన్గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు.జగన్ ఎవరి దగ్గరకు వెళ్ళినా విభజన హామీలను అమలు చెయ్యాలని ప్రధానంగా కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇక నేడు కూడా ఢిల్లీ లోనే ఉండనున్నారు వై ఎస్ జగన్ .. ఢిల్లీ లో ఇంకా కొందరు కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో కలిసి మాట్లాడాల్సి ఉందని భావిస్తున్న జగన్ ఈ రోజు పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్నారు. తిరిగి మరో రోజు పులివెందుల వెళ్లనున్నారు.
జగన్ ఢిల్లీ టూర్ పై మండిపడుతున్న టీడీపీ
ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రధానికి సమర్పించిన వినతిపత్రం ప్రజా పత్రమని.. వాటిలో ఏముందో ప్రజలకు తెలియజేయాలని యనమల డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రధానికి అందించిన వినతిపత్రం కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. డాక్యుమెంట్ తొక్కిపట్టి కేవలం పత్రికా ప్రకటన విడుదల చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానికి నివేదించిన వాటిలో మీకు నచ్చిన అంశాలే ప్రజలకు చెబుతారా? అని జగన్ ను నిలదీశారు . వైసీపీ ప్రభుత్వం చేతగానితనం బయటపడుతుందనే డాక్యుమెంట్లను తొక్కిపెట్టారని యనమల ఫైర్ అయ్యారు.