సీఎం జగన్ ఈజ్ బ్యాక్ - ప్రధాని పర్యటన : ప్లీనరీ - కీలక ప్రకటనలు..!!
ముఖ్యమంత్రి జగన్ తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. పారిస్ పర్యటన ముగించుకొని ఆయన తాడేపల్లిలోని తన నివాసానికి చేరారు. పారిస్ నుంచి తిరిగి వచ్చిన సీఎం జగన్ కు మంత్రులు-అధికారులు స్వాగతం పలికారు. తన కుమార్తె హర్ష పారిస్ లోని ఇన్సీడ యూనివర్సిటీలో డిస్టింక్షన్ లో డిగ్రీ సంపాదించారు. దీంతో..ఆ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తన కుమార్తె పట్టా అందుకోనుండటంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ - భారతి దంపతులు పారిస్ వెళ్లారు.
డిగ్రీ పట్టా అందుకున్న కుమార్తును సీఎం జగన్ అభినందిస్తూ చేసిన ట్వట్ వైరల్ గా మారింది. రేపు (సోమవారం) రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉండటంతో..స్నాతకోత్సవం ముగిసిన వెంటనే సీఎం ఏపీకి తిరుగు పయనమయ్యారు. ఇక, ఈ రోజున ఆయన ప్రధాని పర్యటనకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు.
ఏపీలో ప్రధాని పర్యటన
రేపు ఉదయం ప్రధాని మోదీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. అక్కడ నుంచి భీమవరం వెళ్తారు. ప్రధానికి స్వాగతం పలకటం.. కార్యక్రమం - పర్యటన ముగిసే వరకూ సీఎం ఆయనతోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని మోదీ తిరుమలకు మాత్రమే వచ్చేవారు.
జిల్లాలకు రావటం ఇదే తొలి సారి కావటంతో..ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని పర్యటన సమయంలోనే ఏపీలోని రాజకీయ - ఆర్దిక - పరిపాలన స్థితి గతుల నుంచి సీఎం నేరుగా ప్రధానికి వివరించే అవకాశం ఉంది. ఆర్దికంగా కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వం మరింత తోడ్పాటును ఆశిస్తోంది.
ప్రధానితో కీలక అంశాల ప్రస్తావన
ఇక, పోలవరం పైన ప్రధాని స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ ఈ సమయంలో కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక, 5వ తేదీ సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోని పర్యటనకు వెళ్లనున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వేళ.. విద్యా కానుక ప్రారంభించనున్నారు. ఈ నెల 8,9 తేదీల్లో మంగళగిరి సమీపంలో వైసీపీ ప్లీనరీ జరగనుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ కావటంతో దీనిని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్లీనరీలో సీఎం జగన్ ముగింపు ప్రసంగం చేయనున్నారు.
ప్లీనరీ వేదికగా కీలక నిర్ణయాలు
అందులో కీలక నిర్ణయాల పైన స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. గత ప్లీనరీ వేదికగా నవరత్నాలు - పాదయాత్రను ప్రకటించిన జగన్.. ఇప్పుడు 2024 ఎన్నికల టార్గెట్ గా ఎమ్మెల్యే టిక్కెట్ల ఖరారు...ప్రభుత్వ పరంగా తీసుకోబోయే కీలక నిర్ణయాల పైన ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. దీంతో..వైసీపీ శ్రేణులు ప్లీనరీ వేదికగా జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తితో కనిపిస్తున్నారు.